వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు విమర్శించుకోవడం చాలా సహజం. ఇక ఎన్నికలప్పుడైతే ఆ విమర్శలు తారస్థాయికి చేరుతాయనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ప్రస్తుతం నంద్యాల ఉపఎన్నిక నేతల నోటికి ఫుల్లుగా పనిచేప్తోంది. తాజాగా టీడీపీ తరపున బాలకృష్ణ, వైసీపీ తరపున రోజా బరిలోకి దిగారు. అయితే బాలకృష్ణపై రోజా సాఫ్ట్ కార్నర్ చూపించడం ఆసక్తి కలిగిస్తోంది.
బాలకృష్ణ – రోజా కాంబినేషన్ లో చాలా సినిమాలొచ్చాయి. అవన్నీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. అయితే అదంతా గతం. ఇద్దరు రాజకీయాల్లోకి వచ్చారు. రోజా టీడీపీతోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. తర్వాత వైసీపీ గూటికి చేరారు. వైసీపీ తరపున ఆమె ఇప్పుడు ఫైర్ బ్రాండ్. రోజా నోరు విప్పిందంటే చాలు .. ఎదుటివాళ్లు నోరు మూసుకోవాల్సిందే అన్నట్టు ఆమె మాటలు ఉంటాయి.
నంద్యాలలో రోజా ఎంటర్ కాగానే ఇక మాటలతూటాలు పేలుతాయనుకున్నారు. రోజా మాత్రం టీడీపీని టార్గెట్ చేసి మాట్లాడింది. కానీ అదే సమయంలో టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొంటున్న బాలకృష్ణపై మాత్రం రోజా ఏమీ మాట్లాడలేదు. పైగా బాలకృష్ణ అమాయకుడు అని కితాబిచ్చింది. చంద్రబాబు బాలకృష్ణను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించింది. బాలకృష్ణ అమాయకత్వం నుంచి బయటపడాలని సూచించింది.
బాలయ్యపై నేరుగా విమర్శలు గుప్పించకపోయినా.. రోజా మాత్రం ఆయన మేలుకోరేలా సూచనలిచ్చింది. మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు బాలయ్యను కూడా వాడుకుని వదిలేస్తారని రోజా చెప్పింది. మరి బాలకృష్ణ వీటిపై ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం.