గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ని నంద్యాలలో ఉప ఎన్నికల జోరు ఊపందుకుంది. ఇప్పటికే నంద్యాలలో ఇరు వర్గాల పార్టీ సభ్యులు తమదైన స్టైల్లో పోటీ పడి మారీ ప్రచారం చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తూ అధికార పార్టీ పై విరుచుకు పడ్డారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని..ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో లాలూచీ పడుతున్నారని, మద్యం ఎరులై పారేలా చేస్తున్నారని విమర్శించారు.
తాజాగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనంతపురం టీడీపీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. . శుక్రవారం ఆయన నంద్యాలలో విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారని..ఆయన దగ్గర డబ్బే లేదని అంటున్నారని.. అలాంటిది మరి జైలుకు ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని అన్నారు.
అంతే కాదు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఎంతో ఆశపడుతున్నారని కానీ ఆయన ఆశ అస్సలు నెరవేరదని అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చంద్రబాబు పాలనపై ఎంతో నమ్మకాన్ని పెంచుకున్నారని జగన్ ఎన్ని ఎత్తులు వేసినా అవి నెరవేరవని అన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు. అంతేగాక నాయకుడు చెప్పే మాటల్లో విశ్వాసం ఉండాలని, నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీదే గెలుపు అన్నారు.