వైఎస్సార్ సీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో పట్టు సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీని ద్వారా జగన్ను మిగిలిన జిల్లాల్లోనూ బలహీనం చేయాలని శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో వీరు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు.. టీడీపీకి శరాఘాతంలా మారుతున్నాయి. పార్టీలో వ్యతిరేకత వచ్చినా.. ఎంత వారించినా.. వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారు. ఆయన రాకను తొలి నుంచి రామసుబ్బారెడ్డి వర్గం వ్యతిరేకిస్తుండటంతో.. ఎమ్మెల్సీ ఇచ్చి శాంతింపజేశారు.
ఇప్పుడు మరోసారి వీరి మధ్య చంద్రబాబు నలిగిపోతున్నారు. ఏకులా మేకులా తయారైన ఆది.. ఎమ్మెల్సీ ఇచ్చినా ఎమ్మెల్యే కావాలంటున్న రామసుబ్బారెడ్డితో బాబుకు చుక్కలు కనిపిస్తున్నాయట. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఫిరాయింపుదారుల నియోజకవర్గాల్లో పరిస్థితి.. ఎలా ఉండబోతోందో ఇప్పటికే ఒక అంచనా కు వచ్చేస్తున్నారు పార్టీ సీనియర్లు!! ఎమ్మెల్యేలు తమకే టికెట్ కావాలని పట్టుబడుతుంటే.. టీడీపీ ఇన్చార్జులు కూడా ఇదే రాగం పాడుతున్నారు. మరికొందరు తమ కుటుంబసభ్యులకు కేటాయించాలనే ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారు.
ప్రస్తుతం కడప జిల్లా జమ్మలమడుగులో ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. అంతేగాక బెదిరింపులు కూడా ఎక్కువవుతు న్నాయట. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో గత కొద్ది నెలలుగా రామసుబ్బారెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డి ల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. మంత్రి ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో అలకబూనిన రామసుబ్బారెడ్డి.. టీడీపీపైనా, చంద్రబాబుపైనా కూడా తీవ్రంగా ఫైరయ్యారని సమాచారం. ఈ క్రమంలోనే ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు.
జమ్మలమడుగు రాజకీయాలు కొలిక్కి రాలేదు. ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రి పాలకమండలి చైర్మన్ పదవిపై రాజకీయ రంగు పులుముకుంది. దీనిని తన కొడుకుకి కట్టబెట్టుకునేందుకు మంత్రి ఆది పావులు కదిపారు. అయితే, దీనిని కోరుకుంటున్న రామసుబ్బారెడ్డి.. ఆది ప్రయత్నాలకు గండి కొడుతున్నాడు. కాగా చైర్మన్ పదవిని తన కుమారుడు సుధీర్కి ఇవ్వకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకొంటానని ఆది ప్రకటించి షాక్ ఇచ్చాడు.
పరిస్థితి మరోవైపు ఇంకా తీవ్రంగా ఉంది. రామసుబ్బారెడ్డి కూడా టీడీపీపై ఫైర్ అవుతున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వడం కాదు.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నాడు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చేతులు దులుపుకుంటే చూస్తూ ఊరుకోమని ఆయన వర్గం అధిష్టానానికి హెచ్చరికలు పంపించారట. అలాగే మాజీ మంత్రి శివారెడ్డి కుమార్తె హైమావతి కూడా రామసుబ్బారెడ్డికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాలని, లేకుంటే తమ దారి తాము చూసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కడపలో ఏదో అనుకుంటే ఏదో అవుతోంది!