నంద్యాల ఉపఎన్నిక ప్రచారం నేటితో ముగుస్తోంది. ఎల్లుండి ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో తెరవెనుక వ్యూహాలకు ఈ రాత్రి నుంచి తెరలేవబోతోంది. ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేకుండా అన్ని పార్టీలూ ఇందుకోసం భారీగానే కసరత్తులు చేస్తున్నాయి. అయితే రెండు వారాలుగా నంద్యాలలోనే మకాం వేసిన జగన్ ఓ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.
సాధారణంగా ఉపఎన్నిక అనగానే అందరూ చాలా లైట్ తీసుకుంటారు. ఎందుకంటే ఉపఎన్నిక ఫలితం ఎప్పుడూ అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకూ జరిగిన ఉపఎన్నికల్లో చాలా వరకూ ఏకగ్రీవంగానే ముగిసిపోతుంటాయి. ఎందుకంటే ఎమ్మెల్యే మరణించినప్పుడో, ఇంకేదైనా కారణం ఉంటేనే ఉపఎన్నిక అనివార్యమవుతుంది. మానవతా దృక్పథంతో మిగిలిన పక్షాలు తమ అభ్యర్థిని పోటీకి నిలపకుండా సహకరించేవి. దీంతో పోటీ ఉండేది కాదు.
కానీ నంద్యాల సీన్ వేరు. నంద్యాలలో 2014లో వైసీపీ గెలిచింది. ఆ పార్టీ తరపున భూమా నాగిరెడ్డి బరిలోకి దిగి విజయం సాధించారు. ఆయన హఠాన్మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఆయన చనిపోయేనాటికి టీడీపీలో ఉండడంతో ఆ స్థానం తమదేనంటోంది టీడీపీ. వైసీపీ మాత్రం తమ పార్టీ గెలిచింది కాబట్టే తమదేనని వాదించంది. ఈ నేపథ్యంలో ఉపఎన్నిక షెడ్యూల్ రావడంతో పోటీ అనివార్యమైంది. ఇరు పార్టీలూ బరిలోకి దిగాయి.
సాధారణంగా ఉపఎన్నిక అనగానే అధికారపార్టీ విజయం సాధించడం ఖాయం అనేది నానుడి. అయితే నంద్యాలలో అంత ఈజీ కాదని గట్టి పోటీ ఇస్తోంది వైసీపీ. ప్రస్తుతం వైసీపీలో టీడీపీ, వైసీపీలు హోరాహోరీ తలపడుతున్నాయి. ఏ పార్టీ గెలిచినా పెద్గ మెజారిటీ రాకపోవచ్చు. ఓ విధంగా చెప్పాలంటే అధికార టీడీపీకి వైసీపీ ముచ్చెమటలు పోయిస్తోంది. ఉపఎన్నిక అనగానే అది అధికారపార్టీ ఖాతాలో పడుతుందనేది అన్ని సందర్భాల్లో వాస్తవం కాకపోవచ్చని వైసీపీ నిరూపిస్తోంది. ఈ విషయంలో మాత్రం జగన్ సక్సెస్ అయ్యారు. మరి చూద్దాం.. ఫలితం ఎలా ఉండబోతోందో..!