ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో ఉప ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం అయ్యాయి. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడం..కొన్ని కొన్ని చెదురు మదురు సంఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగానే సాగుతుంది. ఇప్పటికే 74% వరకు పోలింగ్ పూర్తయినట్లు చెబుతున్నారు. తాజాగా నంద్యాల గాంధీనగర్ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
వైసీపీ నేత రాజ గోపాల్ పై ఒంగోలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సోదరుడు రాంబాబు అనుచరులు దాడికి యత్నం. టిడిపి నేతలు డబ్బులు పంచుతుండగా వైసీపీ నేతలు అడ్డుకోవడంతో ఈ దాడి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
రూరల్, గోస్ పాడు మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే గాంధీనగర్ పోలింగ్ బూత్ వద్ద టీడిపీ నేతలు డబ్బులు పంచుతున్న సమాచారం అందుకున్నారు.
వైసీపీ నేతలు అక్కడకు వెళ్లి అడ్డుకొనబోగా రాంబాబు అనుచరులు దాడికి పాల్పడినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో పలువురు వైసీపీ నేతలకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి పరిస్థితి చక్కదిద్దారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.