కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. కొత్తగా 9 మందిని మోదీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పాతవారిలో నలుగురికి పదోన్నతి ఇచ్చారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు మొండిచేయి చూపారు. మరోవైపు ఆంధ్ర, తెలంగాణల నుంచి కూడా ఎవరినీ తీసుకోలేదు.
రాష్ట్రపతి భవన్ లో కొత్తమంత్రుల ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కొత్తగా 9 మందిని మోదీ తన కేబినెట్ లోకి తీసుకున్నారు. ఇప్పటికే సహాయమంత్రులుగా ఉన్న నలుగురికి కేబినెట్ హోదా కల్పించారు. పదోన్నతి పొందినవారిలో ధర్మేంద్ర ప్రధాన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ ఉన్నారు.
ఇక కొత్తగా 9 మంది మోది టీంలో చేరారు. శివ్ ప్రతాప్ శుక్లా, సత్యపాల్ సింగ్, వీరేంద్ర కుమార్, అనంతకుమార్ హెగ్డే, అశ్వినీకుమార్ చౌబే, అల్ఫాన్స్ కణ్ణంథణమ్, గజేంద్రసింగ్ షెకావత్, రాజ్ కుమార్ సింగ్, హర్దీప్ సింగ్ పూరి.. కేంద్ర సహాయమంత్రులుగా ప్రమాణం చేశారు.
మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కొత్త ఈక్వేషన్ కనిపించింది. కొత్తగా టీంలో చేరినవారిలో బ్యూరోక్రాట్లు, అడ్మినిస్ట్రేటర్లే ఎక్కువగా ఉన్నారు. లోక్ సభ సభ్యులను కాదని రాజ్యసభ సభ్యులకే ఈసారి ఎక్కువ ప్రధాన్యత ఇచ్చారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది.
మరోవైపు... కేబినెట్ విస్తరణలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు స్థానం దక్కలేదు. ఇటీవలే ఎన్డీయేలో చేరిన జేడీయూకు తప్పకుండా విస్తరణలో స్థానం దక్కుతుందని అందరూ భావించారు. అయితే తమకు కేటాయిస్తామన్న శాఖలపై అసంతృప్తిగా ఉండడంతో ఈసారి వారికి జాబితాలో చోటు దక్కలేదు. మరోవైపు అన్నాడీఎంకేలో సంక్షోభం ఇంకా సద్దుమణగకపోవడంతో వారిని కూడా తీసుకోలేదు. తమకు కూడా మరో మంత్రిపదవి కావాలని కోరిన శివసేన వినతిని కూడా మోదీ పట్టించుకోలేదు. దీంతో శివసేన మంత్రి వర్గ ప్రమాణస్వీకారోత్సవానికి గైర్హాజరైంది. దీంతో.. ఎన్నికల ముందు మరోసారి మంత్రివర్గాన్ని విస్తరించవచ్చని తెలుస్తోంది. అందులో మిత్రపక్షాలకు స్థానం కల్పిస్తారని సమాచారం.