ఏపీలో అధికార టీడీపీలో అన్ని జిల్లాల్లోను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాటలు షురూ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ పురుష ఎమ్మెల్యేకు మహిళా ఎమ్మెల్యేకు వార్ స్టార్ట్ అయ్యింది. ఇద్దరూ ఎవరికి వారే తమ మాటే నెగ్గాలంటూ పంతానికి పోతున్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలకు బ్రహ్మరథం పట్టారు. దీంతో 48 వార్డుల్లో 35 చోట్ల టీడీపీ సైకిల్ జోరు సాగింది. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా టీడీపీకి కలవడంతో ఇక్కడ వైసీసీ సోదిలో కూడా లేకుండాపోయింది.
ఇక మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు పరోక్షం కావడంతో ఈ ఎన్నికలకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 16న లాస్ట్ డేట్గా ఫిక్స్ చేశారు. మేయర్ పదవి కాపు మహిళకే ఇస్తామని టీడీపీ ఇంతకుముందే ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి నలుగురు మహిళలు రంగంలో ఉన్నారు. ఈ నలుగురికి ఎమ్మెల్యే, హోం మంత్రి, ఆర్థికమంత్రి, ఎంపీ నలుగురు సపోర్ట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో మహిళకు సపోర్ట్ చేయడంతో ఫైనల్గా మేయర్ పదవి ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ ఉండగానే ఇప్పుడు డిప్యూటీ మేయర్ కోసం కూడా వార్ స్టార్ట్ అయ్యింది.
మేయర్ కాపులకు ఇవ్వడంతో డిప్యూటీ మేయర్ కోసం మరో రెండు ప్రధాన సామాజికవర్గాల వారు పోటీ పడుతున్నారు. వీరిలో ఒక్కొక్కరికి ఒక్కో ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీకే చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా కూడా చీలిపోయారు. మేయర్ పదవి సిటీ నియోజకవర్గానికి ఇచ్చినందున డిప్యూటీ మేయర్ పదవి తన నియోజకవర్గంలో రెండో డివిజన్ నుంచి గెలిచిన తన అనుచరుడు కాళ్ల సత్తిబాబుకు ఇవ్వాలని రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పట్టుబడుతున్నారు.
సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెర్షన్ మరోలా ఉంది. మేయర్ కాపులకు ఇచ్చినందున, డిప్యూటీ మేయర్ నియోజకవర్గంలో బలంగా ఉన్న తన సామాజికవర్గమైన మత్స్యకార వర్గానికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఓ వైపు అటు మేయర్ పీఠం ఎవరికి ఇవ్వాలన్నదే ఇంకా తేలలేదు. ఇప్పుడు డిప్యూటీ మేయర్ పీఠం కోసం రెండు ప్రధాన సామాజికవర్గాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ పడుతుండడంతో ఎవరి ప్రతిపాదనకు తలొగ్గాలా ? అని అధిష్టానం చిక్కుల్లో పడింది. మరి చంద్రబాబు ఈ రెండు పదవుల విషయంలో లెక్కకు మిక్కిలిగా ఉన్న చిక్కుముడులను ఎలా విప్పుతారో చూడాలి.