లగడపాటి రాజగోపాల్! రాజకీయాల్లో అందునా ఏపీ రాజకీయాల్లో అదికూడా రాష్ట్ర విభజన సమయంలో దేశవ్యాప్తంగా ఈ పేరు మార్మోగిపోయింది. జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లోనూ లగడపాటి పేరు పెద్ద ఎత్తున ప్రధాన శీర్చికల్లో వచ్చింది. దీనికి కారణం ఏపీ విభజనకు వ్యతిరేకంగా దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంటులో ఆయన మిరియాల ద్రావకం చల్లారు. దీంతో ఎంపీలు, మంత్రులు, సాక్షాత్తూ అప్పటి స్పీకర్ మీరా కుమార్లు పరుగులు పెట్టారు. అలాంటి రాజగోపాలు సమైక్యాంధ్రకు అనుకూలంగా పలు ఉద్యమాలను లేవనెత్తారు. సమైక్య గళం వినిపించేవారిని చేరదీశారు. ఒకానొక సందర్భంలో తన పార్టీ కాంగ్రెస్ అధిష్టానానికి రాష్ట్రం విడిపోతే ఏర్పడే పరిస్థితులను పార్టీ గతిని కూడా వివరించారు.
అయినా కూడా.. రాష్ట్ర విభజన ఆగలేదు. కానీ, రాష్ట్రం విడిపోకుండా ఉండేందుకు తాను ఎంతగానో కృషి చేస్తున్నానని, ఒకవేళ విడిపోయే సందర్భమే వస్తే.. తాను ఇక ప్రత్యక్ష రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని అప్పట్లో రాజగోపాల్ ప్రకటించారు. అన్నట్టుగానే ఆయన 2014 ఎన్నికల్లో ఎక్కడా కనిపించలేదు. అయితే, తనకు పాలిటిక్స్ మీద ఉన్న ఇంట్రస్టుతో.. ఎన్నికల సమయంలో సర్వేలు చేయించడాన్ని హాబీగా పెట్టుకున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా మళ్లీ ఆయన పొలిటికల్గా ఓ దూకుడు ప్రదర్శిస్తారని అంటున్నారు విశ్లేషకులు. రాజగోపాల్ వంటి బలమైన సమైక్య గళం వినిపించిన నేత తనకు అండగా ఉంటే.. 2019లో గెలుపు నల్లేరుపై నడకేనని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే రాజగోపాల్ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. సవాళ్లు, ఒట్లు, శపథాలు రాజకీయాల్లో దేనికీ కొరగావని, అప్పటికప్పుడే వాటిని వదిలేయాలని, లేకపోతే.. ఇటు వ్యక్తిగత రాజకీయ జీవితంతోపాటు ప్రజలకు ఓ మంచి నాయకుడు దూరం అవుతారని ఇటీవల అమరావతికి పిలిచి మరీ చంద్రబాబు రాజగోపాల్కి క్లాస్ ఇచ్చారట. దీంతో ఆయన ఒకింత మెత్తబడినట్టు తెలుస్తోంది. అయినా కూడామీడియా ముందు తాను రాజకీయాల్లోకి రానని చెప్పుకొచ్చారు.
ఇక, ఒకవేళ రాజగోపాల్ రాజకీయాల్లోకి వస్తే.. తన పాత సీటు విజయవాడ ఎంపీ స్థానాన్ని కోరుకోవచ్చు. అయితే, ఇక్కడ కేశినేని నాని ఉన్నారు. ఈయనను తప్పిస్తే.. బాగుంటుందా? అని బాబు ఆలోచిస్తున్నారు. దీంతో గుంటూరు ఎంపీ గల్లాను చంద్రగిరి కి పంపి.. అక్కడి నుంచి లగడపాటిని పోటీకి దించే ఛాన్స్ ఉందని సమాచారం. ఫలితంగా లగడపాటి రాజకీయాల్లోకి వస్తే.. కేశినేని లేదా గల్లాల్లో ఒకరి సీటు ఎగిరిపోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.