ఏపీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత వైఎస్.జగన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు కనపడుతోంది. 2019 ఎన్నికల కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలతో జగన్ తన పోరాటం రెడీ చేసేశాడు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోను విజయం సాధించాలని కసితో ఉన్న జగన్ అధికార పార్టీలో ఉండి తనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న కొంతమందని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం జగన్ ఎంతకైనా రాజీపడడం లేదట.
మంత్రి అచ్చెన్నాయుడు జగన్ పేరు ఎత్తితేనే విరుచుకుపడుతుంటారు. అసెంబ్లీ లోపలే కాదు, బయట కూడా అచ్చెన్న జగన్ను పదే పదే టార్గెట్ చేస్తుంటారు. చివరకు వైసీపీ వాళ్లు అయితే చంద్రబాబు అచ్చెన్నకు జగన్ను తిట్టే శాఖ అప్పగించినట్టు ఉన్నారని కూడా సెటైర్లు వేశారు. దీనిని బట్టి అచ్చెన్న జగన్ను ఎలా టార్గెట్ చేశారో ? అర్థమవుతోంది. అంతేకాదు అచ్చెన్న వైసీపీ ఎమ్మెల్యేలతో టచ్లో ఉంటూ పార్టీ ఫిరాయింపులను కూడా ప్రోత్సహిస్తున్నాడు.
అచ్చెన్న ఇటీవల వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని, వీరు ఎప్పుడు అయినా పార్టీ మారవచ్చని కూడా ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అచ్చెన్నను ప్రత్యేకంగా టార్గెట్ చేసేందుకు జగన్ ప్లాన్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అచ్చెన్న ప్రాథినిత్యం వహిస్తోన్న టెక్కలి నియోజకవర్గంలో ఆయన్ను ఓడించేందుకు జగన్ ఏకంగా అక్కడ ముగ్గురు లీడర్లను తెరమీదకు తెస్తున్నారు.
2014లో టెక్కలి నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్, ప్రస్తుతం ఈ నియోజకవర్గం కో-ఆర్డినేటర్గా ఉన్న తిలక్, త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న కాంగ్రెస్ సీనియర్ నేత కిల్లి కృపారాణిలను జగన్ అచ్చన్నపై వదలాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే వీరి ముగ్గురిలో ఒకరికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడంతో పాటు మిగిలిన ఇద్దరిలో ఒకరికి ఎమ్మెల్సీ, మరొకరికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ఇలా ఈ ముగ్గురికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం ద్వారా అచ్చెన్నను దెబ్బకొట్టేందుకు జగన్ బిగ్ స్కెచ్ వేసినట్టే తెలుస్తోంది.
టెక్కలిలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్తో పాటు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కుటుంబానికి మంచి పట్టు ఉంది. వీరిద్దరితో పాటు స్థానికంగా మంచి ఫాలోయింగ్ ఉన్న పేరాడ తిలక్ ఇలా ఈ ముగ్గరు సమన్వయంతో ముందుకు వెళ్లి అచ్చెన్నను ఓడించి వస్తే మీకు మంచి ఛాన్స్ ఇస్తానని కూడా జగన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా తనను పదే పదే టార్గెట్ చేస్తోన్న అచ్చెన్నను ఓడించేందుకు జగన్ పన్నిన ఈ త్రిముఖ వ్యూహం ఎంత వరకు సక్సెస్ అవుతుందో ? చూడాలి.