ఏపీలో ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన సోదరి వైఎస్.షర్మిల ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని గత ఎన్నికల నుంచే ఉవ్విళ్లూరుతున్నారు. తన అన్న జైలులో ఉన్నప్పుడు 2012 ఉప ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా తన భుజాలమీదకు ఎత్తుకున్న ఆమె ఆ తర్వాత జగన్ జైలులో ఉన్నప్పుడు ఓ మహిళగా చంద్రబాబుతో సమానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు.
ఈ క్రమంలోనే గత ఎన్నికల్లోనే షర్మిల కడప ఎంపీ సీటు ఆశించారు. అయితే జగన్ తాను పులివెందుల నుంచి, మేనమామ రవీంద్రనాథ్రెడ్డి కమలాపురం నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తుండడంతో పాటు కడప నుంచి కజిన్ అవినాష్రెడ్డి, విశాఖపట్నం నుంచి తన తల్లి విజయలక్ష్మిని సైతం ఎంపీగా బరిలోకి దింపడంతో షర్మిలను పక్కన పెట్టారు.
షర్మిల చివర్లో ఖమ్మం ఎంపీ సీటు అయినా దక్కుతుందని ఆశించినా జగన్ ఆ సీటును పొంగులేటి శ్రీనివాసులరెడ్డికి ఇచ్చారు. గత ఎన్నికల తర్వాత కూడా షర్మిల రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నా జగన్ ఆ సీటును విజయసాయిరెడ్డికి ఇచ్చారు. కనీసం ఎమ్మెల్సీ అయినా దక్కుతుందన్న షర్మిలకు ప్రతిసారి నిరాశే ఎదురవుతూ వస్తోంది. ఆ తర్వాత షర్మిల, ఆమె భర్త అనిల్కు జగన్కు మధ్య తీవ్రమైన గ్యాప్ వచ్చిందన్న ప్రచారం కూడా జరిగింది.
ఇక ఇటీవల వీరి మధ్య గ్యాప్ తగ్గడంతో పాటు షర్మిల కోరిక తీర్చేందుకు జగన్ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. షర్మిల వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. షర్మిల వచ్చే ఎన్నికల్లో కడప లేదా విశాఖపట్నం, ఒంగోలు ఈ మూడు ఎంపీ స్థానాల్లో ఎక్కడో ఓ చోట నుంచి బరిలోకి దిగుతుందని టాక్. కడప ఎంపీ అవినాష్పై అసంతృప్తితో ఉన్న జగన్ ఆయన్ను ఎమ్మెల్సీగా పంపి అక్కడ షర్మిలను దింపాలా ? అన్న ఆలోచనలో ఉన్నాడట.
ఇక మరి కొందరు సీనియర్లు మాత్రం గత ఎన్నికల్లో జగన్ తల్లి వైఎస్.విజయలక్ష్మి ఓడిపోయిన విశాఖలోనే షర్మిలను పోటీ చేయించి అక్కడ షర్మిలను గెలిపించుకోవడం ద్వారా సత్తా చాటాలని చెప్పారట. ఇక మూడో ఆప్షన్గా వైసీపీకి మంచి పట్టున్న ఒంగోలు ఎంపీ సీటు కూడా షర్మిల కోసం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒంగోలు ఎంపీగా ఉన్న వైఎస్.జగన్ బాబాయ్ వైవీ.సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే షర్మిల కోసం జగన్ ఒంగోలును కూడా ఓ ఆప్షన్గా పరిశీలిస్తున్నారట. మరి ఈ మూడు సీట్లలో షర్మిల ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆమె ప్రత్యక్ష ఎన్నికల ఎంట్రీ మాత్రం ఖరారైనట్టే..!