భారత దేశంలో ర్యాగింగ్ వ్యవస్థపై ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా..ప్రతిసారి ఎక్కడో అక్కడ ఈ ర్యాగింగ్ బూతానికి అమాయకులు బలైపోతున్నారు. కొంత మంది సీనిర్ల దాష్టికానికి జూనియర్లు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ర్యాగింగ్ పై నిషేదం వహించిన విషయం తెలిసిందే. కానీ కొంత మంది సీనియర్ విద్యార్థులు జూనియర్లను ఏడిపించడమే తమ లక్ష్యంగా చేసుకొని అమాయకులపై తన కృరత్వాన్ని చూపిస్తున్నారు. ఇది భరించలేని సున్నిత మనస్కులు ఆత్మహత్యలు చేసుకోవడం..లేదా చదువు మానేయడం లాంటివి చేస్తున్నారు.
తాజాగా కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు విషయానికి వస్తే.. కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజ్ లో జూనియర్ విద్యార్థులు కొంత మంది టీచర్లకు సీనియర్ విద్యార్థులపై ఫిర్యాదులు ఇస్తున్నారని భావించి వాళ్లని ఆగస్టు 29న ఓ గదిలో బంధించి కొట్టారు. ఈ ఘటనలో 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడగా, మరికొందరు స్టూడెంట్స్ కాలేజీని వదిలి వెళ్లేందుకు సిద్దమయ్యారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టారు.
ఎంతో భవిష్యత్ ఊహించుకొని విద్యార్థులు కష్టపడి ఈ స్థాయికి వస్తే..కొంత మంది విద్యార్థులు చేస్తున్న అకృత్యాల వల్ల వారి బంగారు భవిష్యత్ నాశనమవుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనపై యాజమాన్యం ఓ కమిటీని నియమించింది. జూనియర్లపై 54 మంది సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడినట్టు గుర్తించారు.
వీరిలో జూనియర్లపై హింసకు పాల్పడిన 15 మందిని ఏడాదిపాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. విద్యార్థులను హింసించి, చంపుతామని బెదిరించిన ఆరుగుర్ని శాశ్వతంగా కళాశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరో తొమ్మిదిమందిని ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ పరీక్షలు రాసేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. మరో 13 మందిని నవంబరు వరకు సస్పెండ్ చేసింది. 24 మందిని కేంపస్ నుంచి పంపించారు.
విద్యార్థులు చదువుకునేందుకు కళాశాలలకు రావాలి కానీ, రౌడీయిజానికి, గూండాయిజం నేర్చుకునేందుకు కాదని వారు తెలిపారు. ఈ చర్యలతో కళాశాల ప్రతిష్ఠ మరింత పెరిగిందని వారు అభిప్రాయపడ్డారు. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యాజమాన్యం చర్యలపై ఆనందం వ్యక్తం చేశారు.