భారత దేశంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్న వార్తలు చదువుతూనే ఉన్నాం. కొంత మంది కీచకులు వృద్దులను, చిన్నారులపై కూడా అత్యాచారం చేస్తున్నారు. మరికొంత మంది దుర్మార్గులు తమ కామవాంఛ తీర్చుకున్న తర్వాత తమ గుట్టు బయట పడుతుందన్న భయంతో..హత్యలకు పాల్పపడుతున్నారు. ఇక గురువు అన్న పదానికి కలంకం తెస్తూ ఓ ఇద్దరు కామాంధులు విద్యార్ధిని పై అత్యాచారం చేయడమే కాకుండా బలవంతంగా అబార్షన్ చేయించడానికి పూనుకొని అడ్డంగా బుక్ అయ్యారు.
వివరాల్లోకి వెళితే..రాజస్థాన్ లోని శికర్ జిల్లా షహర్ పురాలో ఓ కళాశాలలో డైరెక్టర్, లెక్చరర్ తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిని చెరబట్టారు. ఆ విద్యార్థినికి ప్రత్యేక క్లాసులు చెప్పాలనే నెపంతో కాలేజ్ లోని ఓ గదిలో డైరెక్టర్ జగదీష్ యాదవ్, లెక్చరర్ జగత్ సింగ్ గుర్జార్ లు అత్యాచారానికి వడిగట్టేవారు. ఈ విషయాన్ని బయట పెడితే తన భవిష్యత్ లో చదువు లేకుండా చేస్తామని..పరిక్షలో ఫెయిల్ చేస్తామని బెదిరించారు.
ఇలా కొంత కాలం తర్వాత ఆ విద్యార్థిని గర్భం దాల్చడంతో ఇద్దరూ తమ గుట్టు బయట పడుతుందని భయపడ్డారు. దీంతో జగదీష్ యాదవ్, జగత్ సింగ్ గుర్జార్ లు స్థానికంగా ఆసుపత్రి నడుపుతున్న వైద్య దంపతులు రజ్నీష్ శర్మ, కానన్ లను సంప్రదించారు. ఈ క్రమంలో ఆ యువతికి బలవంతంగా అబార్షన్ చేయడంతో అది వికటించి, ఆమె పరిస్థితి విషమించింది.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, స్థానికులు వారిద్దరికి కఠిన శిక్షపడాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కళాశాల డైరెక్టర్, లెక్చరర్, వైద్యులిద్దర్నీ అరెస్టు చేశారు. రేపిస్టులపై గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేయగా, నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేయడంపై వైద్యులపై కూడా కేసు నమోదు చేశారు.