ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు వృధాగా జన సంపదను దుబారా చేస్తూ అభివృద్ది పథకాలకు నిధులు లేవంటున్నాయి. ఆంధ్ర ప్రదెశ్ ప్రభుత్వం ఇంకా అమరావతి నగర నిర్మాణ డిజైన్లను ఇత ప్లాన్లను సిద్ధం చేయకుండానే నగర నిర్మాణం పేరుతో పలు దఫాలు శంకు-స్థాపనల పేరుతో వందలకోట్ల రూపాయిల ప్రజాధనాన్ని వృధాచేస్తే, తెలంగాణా ప్రభుత్వం వాస్తు పేరుతో పాత భవనాలను వది లేసి నూతన భవనాల నిర్మాణాన్ని ప్రారంభిస్తూ అభివృద్ధి పథకాలను గాలికి వదిలేసింది.
అయితే ఇక్కడ ప్రజా హృదయాలను చీల్చేసే ఘటన ముఖ్యమంత్రికి ఒక క్యాంప్ ఆఫీసు ఉంది. ఎందుకంటే తెలంగాణాకు ఆంధ్ర ప్రదేశ్ లాగా కొత్త రాజధాని అవసరం లేదు. భవనాలు సరిపడా ఉన్నాయి. దానికి తోడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖాళీ చేసి వెళ్ళిన భవనాల సంఖ్య తో పాలనకు కావలసిన సదుపాయాలు రెండింతలయ్యాయి.
మనకు అద్భుతమైన సచివాలయం ఉంది. రాజశెఖర రెడ్డి వంటివారు నిర్మించిన ముఖ్యమంత్రి నివాస సదుపాయాలతో కూడిన కాంప్ కార్యాలయముంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇద్దరు మంత్రుల క్వార్టర్లను పడగొట్టి సీఎం నివాసం, క్యాంప్ కాంప్ కార్యాలయం నిర్మించారు. అప్పట్లో ప్రధాన మీడియా దీనిపై పెద్ద వివాదమే లేవదీసింది. దీనికి నాటి ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఇది తన సొంతనివాసం కాదని, సీఎం ఎవరువచ్చినా ఇక్కడే నివాసం ఉండి కాంప్ కార్యాలయాన్ని ఉపయోగించు కుంటారని అన్నారు.
ముఖ్యమంత్రికి అధికారిక నివాసం, కాంప్ ఆఫీస్ అవసరం ఎంత ముఖ్యమో తెలియదా? అని మీడియాని ప్రశ్నించారు. అయినా రాష్ట్ర విభజనానంతరం కలవకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్య మంత్రి అవగానే అధికారానికి అవధులు లేకుండా పోగా, దానికి "వాస్తు పిచ్చి పట్టి" ఆయనకు నూతన నివాస భవనం "ప్రగతి భవన్" నిర్మించారు. కోట్ల రూపాయల ప్రజాధనం తమకు నచ్చినట్లు మనసుకు తోచినట్లు శాస్త్రీయత లేకుండా ఇష్టారాజ్యంగా ఖర్చుచేస్తున్నారు.
ఈ నూతన భవన నిర్మాణానికి దాని ఖర్చుకు ఏమైనా శాస్త్రీయత ఉందా? అంటే ముఖ్యమంత్రి గారి చిత్తానికి నచ్చకపోవటమే ఇందులో ఇమిడి ఉన్న శాస్త్రీయత. ఏవో కాకమ్మ కబుర్లు చెప్పటం తప్ప, వేరే ఇతర కారణాలు ఏమీ కనిపించవు. ప్రజలు తాము స్వేదం చిందించిన సంపాదించిన సొమ్ము నుంచి "పన్నుల రూపంలో చెల్లించిన డబ్బు" ను ప్రభుత్వాధినేతల పదవీ వ్యామోహానికి, అధికార దర్పానికి, ఆర్భాటాలకు ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని కష్టార్జితాన్ని ఖర్చుచేయటం, ఎంతవరకు న్యాయం? ప్రజాసంపదల పరిరక్షకుడుగా సంరక్షకుడుగా కెసిఆర్ ప్రజలకు చేసిన మేళ్ళేమిటి?
కొత్త రాజధానైతే సౌకర్యాలు ఉండవు కాబట్టి నూతన నిర్మాణాలకు పూనుకోవటం వరకు సహజమే. కానీ రాష్ట్ర విభజన తర్వాత కేవలం "వాస్తు కారణం" తోనే ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యదర్శుల (ఐఏఎస్) అధికారుల నివాసాలకోసం నిర్మించిన కొన్ని నివాసభవనాలను కూల్చివేసి ఏకంగా ఒక లక్ష చదరపు అడుగుల్లో క్యాంప్ కార్యాలయం, సకల హంగులు, ఆర్భాటాలతో ముఖ్య మంత్రి నివాసం, సమావేశ భవనాలు వంద కోట్ల రూపాయల వ్యయం చేసి నిర్మించటమెంతవరకు సబబు.
మరి ఇఫ్పటికే ఉనికిలో ఉన్న సీఎం క్యాంప్ ఆఫీస్, సీఎం నివాస భవనాలు వృధాయే కదా! దీనికి తోడు కూల్చివేసిన కార్య దర్శుల భవనాల స్థానం లో వారికి నివాసాలు ఏర్పాటు చెయ్యక తప్పని పరిస్థితి. ప్రజాస్వామ్యంలో రాజుల్ల అధికార దర్పాలు ప్రదర్శించనవసరం లేదు. కాని కెసీఆర్ మాత్రం రాజదర్పం ప్రదర్శిస్తూ తనకు నచ్చినట్లు అద్భుత భవనాన్ని కట్టించు కున్నారు.
మరో ప్రయత్నం గా అలాంటి ప్రయోగమే చేస్తున్నారు - అదే హైదరాబాద్ నడిబొడ్డున, హుస్సేన్ సాగర్ ఎదురుగా ఉన్న అద్భుత సచివాలయం ఉండగా "బైసన్ పోలో గ్రౌండ్" లో మరో సచివాలయం నిర్మాణ ఆలోచన ఎందుకు వచ్చింది. దానికి కారణం మరలా వాస్తు బాగ లేదనే విషయం రాష్ట్ర ప్రజల్లో బలంగా ఉండటమే కాదు ముఖ్యమంత్రి కెసీఆర్ స్వయంగా విలేకరు ల సమావేశంలోనే చెప్పారు.
Design of proposed new Secretariat building
అంటే కెసీఆర్ కు వాస్తు వ్యక్తిగతంగా బాగోకపోతే ప్రజా సంపద అయిన కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన క్యాంప్ ఆఫీసులను సచివాలయాన్ని తమ ఇష్టారాజ్యంగా మార్చుతూ కొత్తగా నిర్మిస్తారా? దీనికి హద్దు ఉండదా? ఎవరి సొమ్మని ఇలా వృధా చేస్తున్నరని లక్షల గొంతుకలు ప్రతిధ్వనిస్తున్నాయి.
ఈ ప్రణాలికా కాలం తరవాత ఎన్నికలు జరిగి కెసిఆర్ స్థానంలో, మరో కొత్త ముఖ్యమంత్రి వస్తే ఆయన కూడా వాస్తుకు అను గుణంగా మరో క్యాంప్ ఆఫీసు, మరో సచివాలయం ఆయనకు నచ్చిన వాస్తు పండితుని సలహా ప్రకారం కట్టుకుంటానంటే ఎలా? ప్రజల సొమ్మును లెక్ఖా పత్రం ఉండదా? జవాబుదారీ ఉండదా? జాతికి రక్షకులుగా ఉండాల్సిన వాళ్ళే ఇలా అనవసర ఖర్చులు పెడితే వారిని ప్రజాసేవకులని ఎలా అనగలం?
"సచివాలయానికి బైసన్-పోలో గ్రౌండ్ - ఏమాత్రం ఆమోదయోగ్యంకాదని" ఇప్పటికే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ — జామ్ ల కారణం గా పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయని, అక్కడ సచివాలయం కడితే పరిస్థితి మరింత దయనీయంగా దారుణంగా తయారౌతుందని అధికార వర్గాలు, ప్రజా సంఘాలు, విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
అసలు కొద్ది కొద్ది మార్పులు (రెనవేషన్) చేసి ప్రస్తుత సచివాలయంలోని పాత భవనాల వినియోగించుకోవచ్చని, కావాలంటే కొన్ని కొత్త నూతన భవనాలను కట్టుకోవచ్చు. బైసన్-పోలో గ్రౌండ్ లో సచివాలయం అంటే భవిష్యత్ లో ప్రజలకు ఇబ్బందులు ఇబ్బడి ముబ్బడై, కష్టాలు తప్పవంటున్నారు. "నూతన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దానికి ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి ప్రజా పరి పాలనతో తనదైన ప్రత్యేక ముద్రవేసి ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటారని" కానీ తెలంగాణా సీఎం కెసీఆర్ మాత్రం ఇలాంటి నూతన భవనాలతో, హంగు ఆర్భాటాలతో తన ముద్ర వేయాలని కోరుకుంటున్నారని కొందరు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు. అప్పుడు తుగ్లక్ పాలన మన కళ్ళ ముందు గోచరించటం తథ్యం అంటున్నారు.
Bison Polo Grounds
తొలుత ఒక కుక్కని చంపాలంటే దానికి "పిచ్చి ఉందని, అది పిచ్చికుక్క" అని ప్రచారం చేసి దాన్ని చపేసే వైనం లాగానే - ప్రస్తుత సచివాలయానికి వాస్తు దోషమో? శాపమో? ఉందని దానిపై తొలుత ప్రచారం చేసిన ముఖ్యమంత్రి, తర్వాత జనం లోని ఆగ్రహావేశాలు చూసి - అగ్ని ప్రమాదాల అంశాన్ని యవనిక పైకి తెచ్చి, ప్రస్తుత సచివాలయం పాలనకు యోగ్యం కాదని ముద్ర వేసే ప్రయత్నం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్నీ జిల్లాల్లో పలుశాఖలకు, పలు పాఠశాలలకు, పోలీస్ స్టేషన్లకు, ఆసుపత్రులకు, విశ్రాంతి భవనాలు మొదలైన వాటికి ప్రభుత్వ భవనాలే లేవని, అలాంటి ముఖ్యమైన అవసరాలను గాలికి వదిలేసి, మహోన్నత నగరం హైదరాబాద్ లో అద్భుతంగా నిర్మించి ఉపయోగంలో ఉన్న సచివాలయాన్ని వదిలేసి, వందల వేల కోట్ల రూపాయలతో మరో సచివాలయం తదితరాలు కట్టడానికి సిద్ధపడటం అసలు సరైన పనేకాదని ప్రభుత్వ అధికారులు, ఇతర నాయకులు, అనుభవఙ్జులైన ప్రజలు, ఆర్ధిక నిపుణులు తదితర వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. "ఒక క్యాంప్ ఆఫీస్ ఉండగా మరో నూతన కాంప్ ఆఫీస్ - ఒక సెక్రటేరియట్ ఉండగా - మరో నూతన సెక్రటేరియట్" నిర్మాణ ప్రతిపాధనను ప్రజలు హర్షించరు.