ఏపీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికతో పాటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం తర్వాత కొన్ని జిల్లాల్లో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఏపీలో వైసీపీకి ఫ్యూచర్ లేదని చాలా మంది వైసీపీ సీనియర్లలోనే పెద్ద కలవరం ప్రారంభమైంది. వీరంతా తమ పొలిటికల్ ఫ్యూచర్పై ఆందోళన చెందుతున్నారు. 2019 ఎన్నికల్లోను సైకిల్ దూసుకుపోతుందని భావిస్తోన్న వీరు వైసీపీకి టాటా చెప్పేసి సైకిల్ ఎక్కేందుకు ఉన్న దారులు వెతుక్కుంటున్నారు.
నంద్యాల ఉప ఎన్నిక తర్వాత దాదాపు 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్టు పేర్లతో సహా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఇక కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎంపీతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు, కృష్ణా జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు కూడా పార్టీ మారే వారిలో కొత్తగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఇక జగన్ బంధువులు, అత్యంత సన్నిహితులు కూడా ఇప్పుడు పార్టీలో ఉండేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ లీడర్, జగన్కు అత్యంత సన్నిహితుడైన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా జగన్ తీరుతో విసిగిపోయి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సదరు సీనియర్ వైసీపీ లీడర్ను జిల్లాలో కీలకంగా ఉన్న ఎమ్మెల్యే పరిటాల సునీత టీడీపీలోకి లాక్కొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది!
జిల్లా కేంద్రమైన అనంతపురం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడిమళ్ల గుర్నాథ్ రెడ్డి తెలుగు దేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. 2009లో వైఎస్ అండదండలతో అనంతపురం ఎమ్మెల్యేగా గెలిచిన గుర్నాథరెడ్డి జగన్ కోసం తన పదవికి రాజీనామా కూడా చేశారు. 2012 ఉప ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా గత ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత గుర్నాథరెడ్డికి క్రమక్రమంగా ప్రయారిటీ తగ్గిస్తోన్న జగన్ తాజాగా అక్కడ ఓ మైనార్టీ నేతను ఇన్చార్జ్గా నియమించారు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన గుర్నాథ్ రెడ్డి ఇటీవల తన అనుచరులతో అంతర్గత సమావేశం నిర్వహించారట. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయనకు ఎప్పటి నుంచో టీడీపీ నేతలతో మంచి సంబంధాలే నెరుపుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నిజానికి దివంగత మాజీ మంత్రి పరిటాల రవి ఉన్నప్పటి నుంచే గుర్నాథ్ రెడ్డికి టీడీపీలో సత్సంబంధాలు ఉండేవట. ప్రస్తుతం రవి భార్య మంత్రి పరిటాల సునీతతో ఆయన సఖ్యతగా మెలుగుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుర్నాథరెడ్డిని సైకిల్ ఎక్కించి జగన్ పార్టీకి దెబ్బకొట్టేందుకు ఆమె ప్రయత్నాలు దాదాపు ఫలించాయని సమాచారం. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్న జగన్కు గుర్నాథరెడ్డి లాంటి బలమైన లీడర్ పార్టీ మారితే జిల్లాలో పెద్ద దెబ్బే.