వచ్చే సాధారణ ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్ది తెలుగు మీడియా రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా కొన్ని ఛానెల్స్ వస్తుంటే, వెబ్ మీడియాలు అయితే పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చేస్తున్నాయి. ఇక ఏపీ కేంద్రంగా వార్తల కవరేజ్ కోసం ఇప్పటికే ఏపీ టైమ్స్ ఛానెల్ స్టార్ట్ అవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలుగు మీడియాలో ఉన్న ఓ ప్రముఖ ఛానెల్ మేనేజ్మెంట్ చేతులు మారింది. 2009 ఎన్నికలకు ముందు ప్రారంభించిన మహాటీవీ కొద్ది రోజులుగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది.
చాలా భారంగా బండి నెట్టుకొస్తోన్న మహాటీవీలో మేజర్ వాటాలను ప్రవాస భారతీయులు కొనుగోలు చేసినట్లు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త మేనేజ్మెంట్ ఛానెల్ను రీ లాంచ్ చేయడంతో పాటు ఇకపై ఏపీ ఫోకస్గానే కార్యకలాపాలు ప్రారంభించాలనే యోచనలో కూడా కొత్త మేనేజ్మెంట్ ఉన్నట్టు సమాచారం. మనకు ఇంటర్నల్గా వినపడుతోన్న సమాచారం ప్రకారం ఏపీలో ఓ ప్రధాన పార్టీకి సపోర్ట్గానే ఈ మార్పులు-చేర్పులు వ్యవహారం ఉండనుందట.
ప్రస్తుతం ఈ ఛానెల్ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కుటుంబీకుల చేతుల్లో ఉంది. అయితే ఛానెల్ వ్యవహారాలను మాత్రం సీనియర్ జర్నలిస్టే ఇనగంటి వెంకట్రావు పర్యవేక్షిస్తున్నారు. కొత్త మేనేజ్మెంట్ ఆయన్ను పక్కకు తప్పించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రవాస భారతీయులు కొంత మంది ఈ ఛానల్ లో మెజారిటీ వాటా 51 శాతం దక్కించుకున్నారు. మిగిలిన 49 శాతం ప్రస్తుతానికి వ్యవస్థాపక ప్రమోటర్ల వద్దే ఉంటుందని సమాచారం.
ఇక ఈ డీల్తో కొత్త మేనేజ్మెంట్ మహాటీవీ దశ మార్చేందుకు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. కొత్త కెమెరాలు..ఎక్విప్ మెంట్ కొనుగోలు పనిలో నూతన యాజమాన్యం ఉందని టాక్. ఈ ఛానల్ వాటాల బదిలీ వ్యవహారంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరంలో కీలకంగా పనిచేస్తోన్న ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మరి ఈ కొత్త మేనేజ్మెంట్ నిర్మాణంలో అయినా మహాటీవీ దశ మారుతుందేమో ? చూడాలి.