జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా జై లవకుశ. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లే రాబట్టుకుంటోంది. అయితే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ చంద్రబాబును టార్గెట్ చేసుకుని రాసినట్లుగా అనిపిస్తాయి. జై కేరక్టర్ ద్వారా వచ్చే కొన్ని మాటలు ఇప్పుడు టీడీపీ వాళ్లకు సూటిగా తాకుతున్నాయట. ఆ డైలాగ్స్ ఏంటో చూద్దామా..!
"పదవిలో మనవాళ్లుండడం వేరు.. మనముండడం వేరు.."
"గెలిచినవాడికే గుర్తింపు.. గెలిపించినోడికి కాదు.."
... ఈ రెండు డైలాగ్స్ చాలు సీన్ మొత్తం కళ్లముందు తీసుకురావడానికి..! ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకోసం జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డారు. ఎన్నికల సమయంలో ముందుండి ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం వేరే సంగతి. అయితే చంద్రబాబుకోసం పనిచేసిన మాట మాత్రం వాస్తవం.
అయితే.. ఆ తర్వాత చంద్రబాబు కుటుంబానికి, హరికృష్ణ కుటుంబానికి మధ్య సంబంధాలు తెగిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమాలకు మాత్రమే పరిమితమైపోయారు. తెలుగుదేశం ప్రస్తావన ఎప్పుడు వచ్చినా మాట దాటేస్తున్నారు. అటు చంద్రబాబు కూడా హరికృష్ణను, ఎన్టీఆర్ ను పట్టించుకోవడం లేదు. లోకేశ్ ను తెరపైకి తెచ్చి తన రాజకీయ వారసుడు అతనేనని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని రెండు డైలాగ్ లను యూజ్ చేశాడా అనిపించేలా ఉన్నాయి. గెలిచినవాడికే గుర్తింపు వస్తుంది కానీ గెలిపించినోడికి కాదు.. పదవిలో మనవాళ్లుండడం వేరు, మనమే ఉండడం వేరు.. ఈ మాటలు చూడగానే చంద్రబాబును ఉద్దేశించి రాసినవేనేమో అని టీడీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయట. బుడ్డోడు ఎప్పటికైనా తాను పదవిలోకి వచ్చేస్తానని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడా.. అని ఫీలవుతున్నారట. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో..!!