రాజకీయాల్లో అందరినీ కలుపుకొని పోవాలి. పదిమందిలోనూ మంచి వాడనే పేరు తెచ్చుకోవాలి. చిన్నా పెద్దా అనే స్థాయిలేకుండా అందరినీ పలకరించాలి. ఈ లక్షణం ఉన్న నాడే.. నాయకుడు అన్నవాడు తొందరగా ఎదుగుతాడు. నాయకుడు అన్నవాడు పదికాలాలు నిలబడగలుగుతాడు. ఇదే విషయాన్ని పసిగట్టిన దివంగత వైఎస్ అప్పట్టో.. నాలుగు మెట్లు కాదు, నలభై మెట్లు దిగి వచ్చాడు. ``నమస్తే.. అక్కయ్యా.. నమస్తే.. చెల్లెమ్మా.. నమస్తే.. అన్నయ్యా.. నమస్తే.. తమ్ముడు.. నమస్తే.. బాబూ.. నమస్తే.. పాపా`` అంటూ తనదైన శైలిలో చేతిని గాలిలో ఊపుతూ.. ప్రజలకు చేరువయ్యారు. అదే ఆయనను వరుసగా రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చింది.
ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఏపీలో విపక్షంగా ఉన్నారు. అయితే, వైఎస్లో ఉన్న కలుపుగోలు తనం జగన్లో లేదు! తనముందు అందరూ చేతులు కట్టుకుని నిలబడాలనే సంస్కృతి పాతుకుపోయింది. ప్రజలతో కఠినంగా, కరుకుగా ఉండాలనే వ్యక్తిత్వం ఆయన సొంతం. ఇప్పుడు ఇదే ఆయనను అందరిలోనూ నవ్వుల పాలు చేస్తోంది. తన సొంత తమ్ముడు అవినాష్ రెడ్డి .. ప్రస్తుతం కడప ఎంపీ. అయితే, ఈయన చాలా సాఫ్ట్ దూకుడు అస్సలు నచ్చదు. ఎలాంటి సమస్యపైనైనా ఆలోచించి నిర్ణయిస్తాడు. ఆలోచించి విమర్శిస్తాడు అనే పేరు సంపాయించుకున్నాడు.
ఈ లక్షణాలే జగన్కు నచ్చడం లేదు. ఇంత సాఫ్ట్ మనిషి రాజకీయాలకు పనికిరాడని, అవినాష్ మెతకదనం వల్లే కడపలో వైసీపీ దెబ్బ తింటోందని జగన్ పార్టీ వర్గాలతో నేరుగానే చెపుతున్నాడని సమాచారం. అందుకే ఈసారి అవినాష్ ని పక్కనబెట్టి షర్మిల లేదా వివేకాకు కడప ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, అవినాష్ విషయంలో ఇలా చేస్తే.. వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ పరంగాకూడా జగన్కు దెబ్బేనని పార్టీ వర్గాలే చెపుతున్నాయి.
ఒక చిన్నస్థాయి అధికారిని కూడా అవినాష్ సార్ అని ఎంతో గౌరవంగా సంబోధిస్తారు. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులు, నాయకులకు సైతం అవినాష్ అదేస్థాయిలో గౌరవం ఇవ్వడంతో కడప జిల్లా వైసీపీ వాళ్లు కూడా అవినాష్ను ఎంతో ఇష్టపడుతున్నారు. ఇక రాజకీయాల్లో దూకుడు ఉన్న నేతలు ఎంత అవసరమో.. దూకుడు సమన్వయం చేస్తూ.. ఆలోచించి మాట్లాడే నేతలూ అంతే అవసరమని జగన్ గుర్తించాలని వారు కోరుతున్నారు. మరి జగన్ అవినాష్ విషయంలో ఏం చేస్తాడో చూడాలి.