ఆంధ్రప్రదేశ్ సచివాలయం సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగులు సీఎం చంద్రబాబునాయుడును ఘోర అవమానం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. సచివాలయంలోని నాలుగో ఫ్లోర్లో గల సమావేశ మందిరంలో సీఎం చంద్రబాబు ఫోటోతో పాటు కొంతమంది దేవుళ్ల ఫోటోలు అక్కడ ఉన్నాయి. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో నాలుగో బ్లాక్ లోని సమావేశ మందిరంలో సోమవారం జేఎన్టీసీ సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది అల్పాహారం తిన్నారు. అనంతరం అల్పాహారం తిన్న ప్లేట్లను అక్కడే టేబుల్ మీద ఉన్న చంద్రబాబు ఫోటో మీద వేసేశారు. కనీసం ఆ ప్లేట్లు వేసే ముందు అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ఉన్న సంగతి కూడా చూశారా..ఒకవేళ చూసినా నిర్లక్ష్యంతో అలాగే వేశారా అన్నది తెలియాల్సి ఉంది. నిజానికి సచివాలయంలో ప్రతీ విభాగంలో ప్రభుత్వాధినేత ఫోటో ఉంటుంది.
సమావేశ మందిరాల్లోనూ ఏర్పాటుచేస్తారు. అదేవిధంగా నాలుగో బ్లాక్లో ఉన్న సమావేశ మందిరంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో పెట్టాలని అధికారులు తీసుకువచ్చారు. కానీ, గోడకు తగిలించే విషయంలో నిర్లక్ష్యం చూపారు. కొన్ని రోజుల నుంచి ప్రేమ్ తో ఉన్న చంద్రబాబు నాయుడు ఫోటో అక్కడే ఉంటుంది. కాగా, సచివాలయ అధికారులు ఈ ఫోటోను డస్ట్బిన్లా వాడుకోవడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు సమయానికి ప్లేట్లను సప్లయ్ చేయడానికి టీ పాయ్ దొరకకపోవడంతో ఫ్రేమ్ కట్టి ఉన్న సీఎం ఫోటోని టీ పాయ్లాగా వాడుకున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మరో అధికారి పాండా దాస్, జేఎన్టీయూ అధికారులతో జరిపిన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ విషయం తెలిసిన అధికార వర్గాలు, టీడీపీ శ్రేణలు భగ్గుమంటున్నాయి.