ఏపీ సీఎం చంద్రబాబు లెక్కంతా పక్కగా ఉంటుంది. కూడికలు, తీసివేతలు అన్నీ సరిచూసుకుని గాని ఏమీ మొదలు పెట్టరు, మాట కూడా మాట్లాడరు. నంద్యాల ఉప ఎన్నికల తర్వాత ఆయన మాటల్లో అంతులేని ఆత్మ విశ్వాసం కనిపిస్తోంది. 2019లోనూ ప్రజలు తమవైపే ఉంటారన్న నమ్మకం ప్రతి మాటలోనూ కనిపిస్తోంది! విపక్షానికి అసలు అవకాశం ఇవ్వరని నేతలకు కూడా స్పష్టంగా చెబుతున్నారు. మరి ఆయనలో ఇంత ఆత్మవిశ్వాసం పెరగడానికి కారణమేంటి? ఆయన ఏ లెక్కన ఇంత నమ్మకంతో ఉన్నారు? అనే సందేహాలు రావొచ్చు. దీనంతటికీ కారణం 16. ఏంటీ 16 అనుకుంటున్నారా? దీనికీ ఒక కథ ఉంది. అదేంటంటే..
ఏపీ ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. అందరిలోనూ చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం పెరుగుతోంది. ఇది నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఇదే ఇప్పుడు చంద్రబాబులో నూతనోత్తేజాన్ని నింపుతోంది. అంతేగాక 2014 ఎన్నికలకు, మొన్న జరిగిన ఉప ఎన్నికలకు లెక్కలేసి మరీ చంద్రబాబు సంతృప్తి పడుతున్నారట. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి మధ్య ఓట్ల తేడా శాతం కేవలం 1.6 శాతం మాత్రమే. ఇటీవల నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ ఫలితాల్లో ఈ తేడా 16 శాతానికి పెరిగింది. ఈ రెండు ఎన్నికలను బేరీజు వేసు కుని వచ్చే ఎన్నికల్లో కూడా తమ పార్టీకి, వైసీపీకి మధ్య తేడా 16 శాతం ఖచ్చితంగా ఉంటుందని విశ్వసిస్తున్నారట.
ఇటీవల చంద్రబాబు ఎక్కువగా నంద్యాల ఉప ఎన్నికనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంతో చంద్రబాబులో కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా బాగా పెరిగాయి. పార్టీ కంటే తనమీదనే ప్రజలు విశ్వాసం పెట్టుకుంటు న్నారని చంద్రబాబు భావిస్తున్నారు. తన పరిపాలన సామర్థ్యమే తనకు మళ్లీ అధికారాన్ని తెచ్చి పెడుతుందని ఆయన అనుకుంటున్నారు. అందుకే ఎమ్మెల్యేల పై ఇటీవల కాలంలో విరుచుకుపడుతున్నారు. తాను చేయించిన సర్వేల్లో తనమీద, పరిపాలన మీద పాజిటివ్ థృక్ఫథంతో ప్రజలు ఉన్నారని, ఎమ్మెల్యేల మీద తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన టెలికాన్ఫరెన్స్ ల్లోనూ, వివిధ సమావేశాల్లోనూ పదే పదే చెబుతున్నారు.
కానీ ఉపఎన్నికలు వేరు… సాధారణ ఎన్నికల వేరన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనరల్ ఎలక్షన్స్ లో ప్రజల మూడ్ వేరేగా ఉంటుందని వివరిస్తున్నారు. ఇప్పటికే ఏపీ సర్కార్ రాయలసీమను, ఉత్తరాంధ్రను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలేవీ అమలుచేయడం లేదు. చంద్రబాబు వాస్తవాన్ని చూడకుండా.. ఎవరో చెప్పింది విని… గణాంకాలతో గడిపేస్తున్నారని చెబుతున్నారు. ఇన్నిసమస్యలను పెట్టుకుని చంద్ర బాబు తన బలం పెరిగిందని చెప్పుకోవడం మానుకోవాలని సూచిస్తున్నారు.