వైసీపీ అధినేత వైఎస్.జగన్ పాదయాత్రకు రెడీ అవుతోన్న వేళ ఆ పార్టీకి పెద్ద షాకే తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ పాదయాత్ర వచ్చే నెల 2 నుంచి స్టార్ట్ అవుతోంది. ఈ పాదయాత్ర ప్రారంభమయ్యే టైంకు కాస్త అటూ ఇటూగా వైసీపీ నుంచి ముగ్గురు కీలక వ్యక్తులు జంప్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఏపీ పాలిటిక్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు నేతల్లో ఒకరు ప్రస్తుత లేడీ ఎమ్మెల్యే అయితే మరొకరు జగన్కు రైట్ హ్యాండ్ అయిన మాజీ ఎమ్మెల్యే. మరొకరు వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు కావడం విశేషం.
తాజాగా అనంతపురం జిల్లాలో వైసీపీ జరిపిన యువభేరి విజయవంతమైందనే చెప్పాలి. అయితే అదే సమయంలో పార్టీలో ఉన్న లుకలుకలు కూడా బయటపడ్డాయి. జగన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ యువభేరి కార్యక్రమానికి పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు డుమ్మా కొట్టేశారు. ఈ కీలక కార్యక్రమానికే వారిద్దరు రాకపోవడం పార్టీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.
అనంతపురం జిల్లాలో జగన్కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డితో పాటు జిల్లాలో వైసీపీకి మిగిలిన ఏకైక ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఈ సమావేశానికి హాజరుకాలేదు. వీరిద్దరు పార్టీ మారతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. జగన్ జిల్లాకు వచ్చినప్పుడు వీరిద్దరిని పిలిచి బుజ్జగిస్తారని అందరూ అనుకున్నారు. అయితే జగన్ జిల్లాకు వచ్చినా వీరిని అస్సలు పట్టించుకోలేదు.
అనంతపురం నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జి పదవి నుంచి గురునాధరెడ్డిని తప్పించిన జగన్ ఆ ప్లేస్లో మైనార్టీ నేత అహ్మద్ నదీమ్ను నియమించింది. తీవ్రమనస్థాపానికి గురైన ఆయన టీడీపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. గురునాధరెడ్డి పార్టీని వీడి టీడీపీలోకి రావడానికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ఇక ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి సోదరుడు మధుసూదన్రెడ్డికి అన్న ప్రయారిటీ తగ్గించేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన్ను టీడీపీలోకి తీసుకువచ్చేందుకు అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ప్రముఖపాత్ర పోషిస్తున్నారు.
ఎమ్మెల్యే రాజేశ్వరిదీ అదే రూటు....
ఇక తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం (ఎస్టీ) నియోజకవర్గ ఎమ్మెల్యే వంతుల రాజేశ్వరి కూడా కొద్ది రోజులుగా జగన్తో పాటు వైసీపీలో తనకు ఓ గిరిజన ఎమ్మెల్యేగా జరుగుతోన్న అవమానాలకు కుంగిపోతున్నారు. విపక్ష ఎమ్మెల్యేగా నియోజవర్గంలో ఎలాగూ అభివృద్ధి చేసుకోలేకపోతున్నానని భావిస్తోన్న ఆమెకు ఇటు జగన్ అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదట. ఇక నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిద్దామన్నా ఆమెకు జగన్ ఛాన్స్ ఇవ్వట్లేదని టాక్. దీంతో కొద్ది రోజుల క్రితం లోకేష్ను కలిసిన రాజేశ్వరి తన గురువు, జగ్గంపేట జంపింగ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారట. ఏదేమైనా జగన్కు ఈ మూడు షాక్లు దిమ్మతిరిగిపోయేలా ఉన్నాయి.