కర్నాటక రాజధానిలో జలకన్య హల్ చల్ చేసింది. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఏరియాలో నడిరోడ్డుపై జల కన్యను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆకుపచ్చ రంగులో నీటిలో జలకాలాడుతూ దర్శనమిచ్చిన జలకన్యను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇంతకూ జలకన్య ఎక్కడి నుంచి వచ్చింది..!?
కర్నాటకలో కొంతకాలంగా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని బెంగళూరులో భారీ వర్షాలు నమోదయ్యాయి. దీంతో నగరంలోని వీధులున్నీ పాడైపోయాయి. రహదారులు అస్తవ్యస్తంగా తయారవడంతో ప్రజలు రోడ్డెక్కేందుకే భయపడిపోతున్నారు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో.. ఎక్కడ కొట్టుకుపోతామో.. అనే భయం వారిని వెంటాడుతోంది. రోడ్లపై రోజుల తరబడి నీళ్లు కూడా అక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికే రహదారులు సరిగా లేకపోవడంతో ఇప్పటివరకూ నలుగురు మృతి చెందారు.
రోజుల తరబడి నీరు రోడ్లపై నిలిచిపోయినా కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అయితే వర్షం పడుతున్న సమయంలో రిపేర్ చేయలేమని, అందుకే కామ్ గా ఉన్నామని చెప్తోంది ప్రభుత్వం. అయితే ప్రజలు మాత్రం ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. అందులో భాగంగానే పలువురు తమదైన శైలిలో నిరసన తెలియజేస్తున్నారు.
రోడ్ల దుస్థితి, ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంతో ప్రముఖ సోషల్ వర్కర్, పెయింటర్ బాదల్ నంజుండస్వామి, సోను గౌడలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. కొంతకాలంగా బెంగళూరులోని రోడ్ల దుస్థితిపై వారి నిరసన కొనసాగుతోంది. ఇందులో భాగంగా కబ్బన్ పార్క్ ఏరియాలో నీరు నిలిచిన చోట జలకన్యను ప్రవేశపెట్టి నిరసన తెలియజేశారు. ఇది నగరంలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యువతి చేపట్టిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.