సీఎం చంద్రబాబుకు రైట్ హ్యాండ్ వంటి మంత్రి యనమల రామకృష్ణుడు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆయన ఇటీవల కాలంలో పార్టీలో తనకు ప్రభావం తగ్గించారని, ప్రాధాన్యం కోల్పోతున్నానని ఫీలయ్యారు. ముఖ్యంగా చినబాబు లోకేశ్ మంత్రిగా వచ్చాక అప్పటి వరకు ఎవరైనా సీఎంను కలవడానికి వచ్చిన వాళ్లు.. ముందు యనమలతో భేటీ అయ్యేవారు. అయితే, లోకేశ్ రాకతో యనమల పూర్తిగా చతికిల పడ్డారు. ఆయనను పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో తీవ్రంగా మథన పడిన ఆయన చాన్నాళ్లు మీడియాకు సైతం దూరంగా ఉన్నారు.
కీలకమైన ఆర్థికశాఖా మంత్రిగా ఉన్న యనమల చెప్పిన వ్యక్తికి కాకినాడ మేయర్ పదవి ఇవ్వలేదు. ఆయనకు ఇష్టం లేకపోయినా జ్యోతుల నెహ్రూ తనయుడిగా జడ్పీ చైర్మన్ ఇచ్చారు. చివరకు కాకినాడ డీఎస్పీ మార్పు విషయంలోను ఆయన మాట నెగ్గలేదంటే యనమలకు ఎలాంటి షాకులు తగులుతున్నాయో అర్థమవుతోంది. అయితే, ఇటీవల కాలంలో తన హవా ఏంటో చూపించాలని భావించిన యనమల.. పార్టీలోని తన ప్రత్యర్థులను టార్గెట్ చేశారు. వారికి తన విలువ ఏంటో తెలిసేలా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తమ్ముడు పళ్ల కృష్ణుడును రంగంలోకి దింపినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన తనను దెబ్బకొట్టే రాజకీయాలు చేస్తున్న వారిలో ఒకరైన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల యాదవుల ఐక్యత పేరుతో సభలు, సమావేశాలు పెడుతున్నారు. ఇప్పటికే శంఖవరం మండలం కత్తిపూడి సమీపంలో ఇటీవల యనమల కృష్ణుడి సారథ్యంలో జిల్లా యాదవ మహాసభను నిర్వహించారు. దానికి ఆయన కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహించారు. ఈ సభకు నియోజకవర్గం నలుమూలల్లోని తమ వర్గానికి చెందిన వారందర్నీ రప్పించారు.
ఆ తర్వాత రౌతులపూడి మండలంలో యాదవ ప్రాబల్యం ఉన్న ఎస్.అగ్రహారం, గిడజాం, లచ్చిరెడ్డిపాలెం, రౌతులపూడి, శృంగవరం గ్రామాల్లో కృష్ణాష్టమి, దుర్గాష్టమి వేడుకల పేరుతో యనమల కృష్ణుడు విస్తృత పర్యటనలు చేయడం మరింత చర్చనీయాంశమైంది.అంతేకాకుండా అదే కులానికి చెందిన శంఖవరం మండల టీడీపీ అధ్యక్షుడు బద్ది రామారావును అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. శంఖవరం, రౌతులపూడి మండలాల్లో యనమల కృష్ణుడు ఎక్కడ పర్యటించినా తనే వెన్నంటి ఉండి నడిపిస్తున్నారు. ఇలా కుల రాజకీయాలకు యనమల తెరదీశారని ఇప్పుడు విస్తృతంగా చర్చ నడుస్తోంది.
దీంతో యనమల గురించి అటు తూర్పు గోదావరి సహా ఇటు అమరావతిలోనూ చర్చలపై చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా యనమలను తక్కువగా అంచనా వేసి ఆయనకు ఎర్త్ పెట్టాలని భావించిన వరుపుల సుబ్బారావుకు ఇప్పుడు కంటిపై కునుకు లేకుండా పోతోందట. మరి భవిష్యత్తులో యనమల తన విశ్వరూపం ఇంకెలా చూపిస్తారోనని తీవ్రంగా చర్చించుకుంటుండడం విశేషం.