ప్రజలకు పాదయాత్రలు కొత్తకాదు.. ముఖ్యంగా ఏపీ వాళ్లకైతే అస్సలు కొత్త కాదు. ఉమ్మడి ఏపీలో అప్పటి కాంగ్రెస్ నేత, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పాదయాత్ర సంచలన రికార్డు నమోదు చేసింది. పాద యాత్ర అనంతరం అస్సలు కాంగ్రెస్ ఊపిరిపోసుకోదు.. అని భావించిన రాష్ట్రంలో ఆయన అధికారంలోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత పర్యాయం కూడా వైఎస్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఈ పాదయాత్రే కారణమైంది. దీనికి ప్రధానంగా వైఎస్ జనాలను ఆకర్షించడమే. ముఖ్యంగా అచ్చ తెలుగు ఆకృతిలో ఆయన ప్రజలకు చేరువయ్యారు. గ్రామాలు, పల్లెల్లో ప్రజలను ఆయన ఆకర్షించారు. అవే ఆ తర్వాత ఓట్ల రూపంలో వైఎస్కి లబ్ధి చేకూర్చాయి.
అయితే, ప్రజలు ఎక్కువగా వైఎస్తో కనెక్ట్ అయ్యేందుకు దోహదపడిన ప్రధాన అంశం పంచె కట్టు. తెల్లగా ధగధగలాడుతూ మెరిసే.. పంచె కట్టు ఆరడుగుల భారీ కాయం... ముఖంపై చెదరని చిరునవ్వు.. కలిసి కట్టుగా మూటగట్టినట్టు వైఎస్ జనాలకు ఇట్టే కనెక్ట్ అయ్యారు. దీంతో గ్రామాలు, పల్లెల్లో కాంగ్రెస్ ఊపు మరింత పెరిగింది. వాస్తవానికి వైఎస్ ఎప్పుడో కానీ ఫ్యాంట్ ధరించేవారు కాదు. ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానంతో భేటీ కావాల్సి వచ్చినప్పుడు, నిత్యం సీఎంగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు కూడా వైఎస్.. పంచె కట్టులోనే ఉండేవారు.
ఇలా జనాలకు ఆయనను చేరువ చేసిన పంచె కట్టు..విషయంలో ఇప్పుడు వైసీపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. నవంబరు 2 నుంచి వైసీపీ అధినేత జగన్.. పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. పట్టణాల్లో వైసీపీకి బలం బాగానే ఉన్నా.. పల్లెలు, గ్రామాల్లో మాత్రం ఆసించిన మేరకు బలం లేదు. దీంతో ఎలాగైనా పల్లెలు, గ్రామాల్లో విస్తరిస్తేనే పార్టీ పవర్లోకి వస్తుందని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పాదయాత్ర పూర్తిగా పల్లెలు, గ్రామాల మీదుగా సాగేలా రూట్ మ్యాప్ కూడా రెడీ అయింది. దీంతో పల్లె జనాలను ఆకర్షించేందుకు తన తండ్రి మాదిరిగా జగన్ కూడా పంచె ధరిస్తే.. బాగుంటుందని ఇటీవల వైసీపీ నేతలు జగన్ కు సూచించారు.
దీంతో ఆయన మౌనంగానే ఊ కొట్టినా.. ఇప్పుడు దానిపై దృష్టి పెట్టినట్టు సమాచారం. జనాలను చాలా వీజీగా కనెక్ట్ చేసుకునేందుకు పంచె కట్టు ప్రథమ యాక్షన్గా బాగుంటుందని, అచ్చతెలుగు పంచె కట్టుతో వారి మనసుల్లో చెరగని ముద్రను వేయడంతోపాటు వైఎస్ అందించిన పాలనను జగన్ అందిస్తాడనే భరోసా నింపేందుకు అవకాశం ఉంటుందని జగన్ ఇప్పడు భావిస్తున్నారట. ఇదే జరిగితే.. పాదయాత్ర మరో సంచలన రికార్డుగా మారుతుందనేది ఖాయం.