నేటితరం కాంగ్రెస్ నాయకుల్లో కురు వృద్దుడిగా ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మళ్లీ కాంగెస్ పార్టీకీ తన సేవలు అందించనున్నారు. కొద్దికాలంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్... దాదా సాయం తీసుకోనుంది. కొద్దికాలంగా ప్రణబ్ నివాసం ఉంటున్న నివాసానికి కాంగ్రెస్ నేతల రాకపోకలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.. కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న ప్రణబ్.. ప్రస్తుతం పార్టీకి ఏ మేరకు సాయం కానున్నారు?
రాజకీయ చాణక్యుడిగా పేరున్న ప్రణబ్ దాదా సేవలను ఇక ముందు కూడా వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కొంతకాలంగా ప్రణబ్ తో పదేపదే భేటీలు సాగిస్తున్న సోనియా, మన్మోహన్ లు ఇందుకు ప్రణబ్ ను ఒప్పించారట. రాష్ట్రపతి గా ఉన్నపుడు భవన్ నుంచే సోనియాకు సలహాలు సూచనలు ఇచ్చిన ప్రణబ్... ఇక నుంచి పార్టీలో కింగ్ మేకర్ పాత్ర పోషించటానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోంటున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రణబ్ కు ఉన్న అపార రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకోవాలనుకుంటుంది. ప్రస్తుత పరిస్థితులలో ఆయన సలహాలు, సూచనలు పార్టీకి చాలా అవసరం అని అధిష్టానం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే ప్రణబ్ నివాసం ఉంటున్న ఢిల్లీలోని రాజాజీ మార్గ్ లోని ప్రణబ్ నివాసానికి కాంగ్రెస్ నాయకుల రాకపోకలు ఎక్కువయ్యాయి.
ఢిల్లీలో తాజాగా ప్రణబ్ ఆత్మకథ మూడో పుస్తకం కొయిలేషన్ ఈయర్స్ 1996-2012 ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలను తప్ప మిగతా నేతలను అందరినీ ఆహ్వానించటంతో ప్రణబ్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి కీలకంగా వ్యవహరించబోతున్నారని స్పష్టం అవుతోంది. ఇటీవల బీజేపీ చేపట్టిన ఆర్ధిక విధానాలపై కూడా ప్రణబ్ ఒకింత అసహానాన్ని వెలిబుచ్చారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం కాంగ్రెస్ కు మళ్లీ మంచి రోజలు వస్తాయంటూ వాఖ్యానించారు.
పుస్తక ఆవిష్కరణ వేదికగా ప్రణబ్ కీలక వాఖ్యలు చేశారు. 2014లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణాలను విశ్లేషించారు. పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని సోనియా, మన్మోహన్ అనుమానించినా... కిందిస్థాయి నేతలు ఇచ్చిన తప్పడు సమాచారం పార్టీని నష్టపరిచిందని చెప్పుకొచ్చారు. 2012లో మమతా యూపీఎ నుంచి వెళ్లిపోవటం కూడా పార్టీకి నష్టం చేసిందని, బీజేపీ గెలుచుకునే స్థానాలను సైతం తక్కువగా అంచనా వేసి పరాజయాన్ని మూటగట్టకుందన్నారు.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాహుల్ చరిష్మా ఆ పార్టీకి ఏమాత్రం ఉపయోగపడట్లేదు సరికదా ప్రతిదీ రివర్స్ అవుతోంది. అందుకే ఆ పార్టీకి ప్రణబ్ లాంటి మేధావుల సూచనలు పార్టీకి ఎంతో అవసరం. అందుకే సోనియా, మన్మోహన్ తదితరులు దాదాను రిక్వస్ట్ చేయడంతో ఆయన సరేనన్నట్టు సమాచారం.