ఆర్థిక కష్టాలు వైసీపీని తీవ్రంగా వేధిస్తున్నాయి.. అయినా అధినేత జగన్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటున్నారు. నాయకులు పార్టీని వీడుతున్నా.. భవిష్యత్ మనదేనంటూ వాళ్లకి నచ్చజెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అధికారం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా.. అది అందని ద్రాక్షగానే మిగిలిపోతోందనే భావన నాయకుల్లో పెరిగిపోతోంది! ఈ తరుణంలో నవంబరు 2 నుంచి ఆయన చేపట్టనున్న పాదయాత్ర వారికి సరికొత్త కష్టాలు తెచ్చి పెట్టేలా ఉంది. 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తుండటంతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లకు చేతి చమురు ఎవరు వదిలించుకుంటారనే చర్చ పార్టీలో మొదలైంది.
ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ పాదయాత్ర చేస్తానని ప్రతిపక్ష నేత జగన్.. ప్రకటించిన నాటి నుంచి దిగువ శ్రేణి నాయకుల్లో కొంత ఆందోళన నెలకొంది. భారీ లక్ష్యంతో చేపడుతున్న పాదయాత్రకి ఖర్చులు కూడా అంతే భారీగా ఉంటాయి కదా! దీంతో పాదయాత్ర నిర్వహణ ఖర్చులు ఎవరు భరిస్తారనే ప్రశ్న అందరిలోనూ అప్పటి నుంచి మొదులుతోంది. జగన్తో పాటు ప్రతి రోజూ యాత్రలో పాల్గొనేందుకు స్థానిక నేతలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. నవంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. మరి వీటి నిర్వహణకు ఎవరు ఖర్చుచేస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది.
గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేపట్టినాటి పరిస్థితిలు వేరు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి… నిధుల పరంగా కొంత వెసులుబాటు ఉంటుంది. ఇక, చంద్రబాబు పాదయాత్ర విషయానికొస్తే.. టీడీపీ సంస్థాగతంగా బలమైన పునాదులున్న పార్టీ. కాబట్టి, ఆర్థికంగా పార్టీ బలంగానే ఉంది. ఇక అదే సమయంలో రోజుకి దాదాపు రూ. 20 లక్షలు ఖర్చయ్యేదని టీడీపీ నేతలు చెబుతారు. మరి ఇప్పుడు ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే, పాదయాత్ర చేపడుతున్న నాయకుడికి రక్షణగా కొంతమంది వస్తారు, నాయకులు వస్తారు, కార్యకర్తలు వస్తారు! వీరందరికీ ప్రతీరోజూ ఎక్కడో చోట బస ఏర్పాటు చేసుకోవాలి, భోజన సౌకర్యాలు చూడాలి.
ప్రస్తుతం జగన్ పాదయాత్రలో ఆయన బస కోసం అత్యాధునిక సదుపాయలతో ఉన్న ఒక బస్సును సిద్ధం చేసుకున్నా రట! ఆయనతో తరలివచ్చే నాయకులకు టెంట్లు లాంటి తాత్కాలిక ఏర్పాట్లు ఎక్కడికక్కడ ఉంటాయని చెబుతున్నా రు. ఇక, సభల నిర్వహణ, జనాల తరలింపు వంటివి ఉండనే ఉన్నాయి. ఖర్చంతా తానే భరిస్తానని జగన్ అన్నారని ఒకసారి, వైకాపా నేతలు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా ఖర్చులు భరిస్తామని చెప్పినట్లు వార్తలు గుప్పుమన్నాయి. స్థానిక నేతలు జనసమీకరణలు మాత్రమే చూసుకుంటే చాలని వీరు చెబుతున్నారట! కానీ, పార్టీ స్థానిక నేతలపై ఎంతో కొంత భారం పడటం ఖాయమనే చెప్పాలి.
ఎందుకంటే, స్థానికంగా సభల ఏర్పాటు, జనాల తరలింపు వంటి ఖర్చులన్నీ స్థానిక నేతలపైనే పడుతుంది. ఏదేమైనా.. ఒక పాదయాత్రకి, కేవలం ప్రచారం కోసం జరుగుతున్న ఈ యాత్రకి కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైపో తున్నారు. జన సమీకరణ, సభల నిర్వహణకీ స్థానిక నేతలు ఖర్చులు పెట్టేసుకుంటారని అంటున్నారు. మరి దీని ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే!!