ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాలేజీ యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన సంకేతాలిచ్చారు సీఎం చంద్రబాబు. నాలుగైదు రోజుల్లో మార్పు కనిపించకపోతే.. చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రైవేటు కళాశాలల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేశారు. కాలేజీ యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులతో ఓ కమిటీ ర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి నెలా ఈ కమిటీతో సమావేశం ఉంటుందని తెలిపారు. ఏపీని నాలెడ్జ్ సొసైటీగా చేయాలనుకుంటే.. విద్యార్థులను రోబోలుగా మార్చుతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత కార్పొరేట్ విద్యా విధానాన్ని అస్సలు సహించబోనని స్పష్టం చేశారు.
విద్యార్థులతో అనుసరించాల్సిన విధానం, పద్దతులలో తక్షణం మార్పులు తీసుకురాకపోతే కఠినచర్యలకు వెనకాడబోనని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్పొరేట్ కాలేజీలకు స్వీయ నియంత్రణ ఉండాలని.. విద్యార్థుల్ని వేధించే పద్ధతుల్ని తక్షణం వదిలిపెట్టాలని సూచించారు. నాలుగైదు రోజుల్లో ఈ మార్పు కనిపించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశమవుతానని చంద్రబాబు చెప్పారు.
ఇంటర్ లో ఇకపై ర్యాంకులకు బదులు గ్రేడింగ్ విధానం అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. కొన్ని కాలేజీల్లో పద్దెనిమిదిన్నర గంటల పాటు క్లాస్ లు నిర్వహిస్తున్నారని, ఇది దారుణమని మండిపడ్డారు. టైమింగ్స్ తగ్గించి శారీరక వ్యాయమానికి ప్రధాన్యం ఇవ్వాలని గంటా సూచించారు. ప్రతి ఆదివారం ఖచ్చితంగా విద్యార్థులకు చదువు నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను యంత్రాల్లా చూడవద్దని గంటా సూచించారు.
భవిష్యత్తులో ఆత్మహత్యలు జరగడానికి వీల్లేదని సీఎం చెప్పారని మంత్రి గంటా వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే కాలేజీలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. అనుమతి లేని కాలేజీలు మూడు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని లేదంటే కాలేజీలను మూసివేస్తామని హెచ్చరించారు.