తమిళనాడులో రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు నటుడు కమల్ హాసన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి పలువురు నేతలతో కూడా ఆయన భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎవరికి మద్దతిస్తారోననే ఉత్కంఠ చాలాకాలంగా నెలకొంది. అయితే ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చింది. ఆయన ఎట్టిపరిస్థితుల్లో బీజేపీకి మద్దతివ్వబోరని స్పష్టమైంది.
కమల్ హాసన్ రాజకీయ రంగప్రవేశం వచ్చేనెలలో కన్ఫామ్ కానుంది. ఆయన బర్త్ డే రోజున పార్టీని అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. కమల్ హాసన్ పార్టీ పెడితే ఏ రాజకీయ పార్టీకి మద్దతిస్తారోనని తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. ఆయన గతంలో బీజేపీతో సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ తో భేటీ కావడంతో.. ఆయనతో కలిసి వెళ్లవచ్చనే ప్రచారం జరిగింది. మరోవైపు.. కేరళ సీఎం పినరయి విజయన్ సమావేశం కావడంతో కమ్యూనిస్టులతో కలసి వెళ్లవచ్చని అనుకున్నారు.
అయితే .. కమల్ హాసన్ మాత్రం ఇప్పటివరకూ ఎవరితో కలిసి వెళ్తారో క్లారిటీ ఇవ్వలేదు. అయితే పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత వచ్చే ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేసేందుకు సిద్ధమని కమల్ ప్రకటించారు. అదే సమయంలో తమిళనాడులోని ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోనని స్పష్టం చేశారు. దీంతో ఏదైనా జాతీయ పార్టీతో కలసి వెళ్తారేమోనని అందరూ ఊహించారు. అయితే అందులో బీజేపీ మాత్రం లేదని స్పష్టమైంది.
ఎందుకంటే.. గతంలో పెద్దనోట్ల రద్దును కమల్ హాసన్ స్వాగతించారు. మోదీ తీసుకున్న అతి గొప్ప నిర్ణయమని కొనియాడారు. దీనివల్ల నల్లధనం బయటకు వస్తుందని .. మోదీకి శెభాష్ అని పొగిడారు. అయితే ఇప్పుడు మాత్రం అది తప్పని లెంపలేసుకున్నారు. నాడు పెద్దనోట్ల రద్దును సమర్థించినందుకు క్షమాపణ చెప్తున్నట్టు ప్రకటించారు. దానివల్ల అద్భుతమేదో జరుగుతుందని నాడు భావించి.. శెభాష్ అన్నానని వివరణ ఇచ్చారు. మోదీ కూడా తప్పయిపోయిందని లెంపలేసుకుంటే మరోసారి శెభాష్ అంటానని కమల్ హాసన్ అన్నారు. దీన్నిబట్టి బీజేపీతో వెళ్లేందుకు కమల్ హాసన్ సిద్ధంగా లేరని స్పష్టంగా అర్థమవుతోంది.