గతంలో ఎంపీగా చేసిన హైదరాబాద్ క్రికెటర్ అజారుద్దీన్ మళ్లీ 2019లో తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయాలని భావిస్తున్నారట. ఈయన మనసులో మాట తెలియగానే కాంగ్రెస్ నేతలు అప్పుడే ఈయనపై ఒత్తిళ్లు పెంచేశారు. వచ్చే ఎన్నికల్లో మజ్లిస్పై పోటీ చేయాలని ఆయనను కోరినట్టు తెలిసింది. గురువారం హైదరాబాద్ నగరంలోని చార్మినార్ వద్ద సద్బావన అవార్డు అజహరుద్దీన్ కు ప్రదానం చేసిన సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ నేతలు అజహరుద్దీన్ కు ఈ మేరకు సూచనలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, టీకౌన్సిల్ పక్ష నేత ముహమ్మద్ అలీ షబ్బీర్, మాజీ ఎంపీ వీ హనుమంతరావులు మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం గురించి హైదరాబాదీ అయిన అజహరుద్దీన్ కు అవగాహన ఉందని, ఇక్కడి ప్రజల సమస్యలు ఆయనకు తెలుసని అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని సూచించారు.అజహరుద్దీన్ గత 2009 ఎన్నికల్లో మొరాదాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇక గత ఎన్నికల నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇక, టీపీసీసీ నేతల సూచనల నేపధ్యంలో అజహరుద్దీన్ హైదరాబాద్ లోక్ సభ బరిలో దిగుతారన్నదానిపై అప్పుడే చర్చలు స్టార్ట్ అయ్యాయి. వాస్తవానికి మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డికి సన్నిహితుడు అయిన అజార్ను గత ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయించాలని కిరణ్ ప్లాన్ చేశారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేయడంతో ఆ ప్లాన్ కుదర్లేదు.
ఇక ఇప్పుడు మరోసారి టీ పీసీసీ నేతలు మళ్లీ అజార్ను హైదరాబాద్ నుంచి పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అజార్ను ఒకవేళ హైదరాబాద్ ఎంపీ సీటు నుంచి కాకపోయినా.. ముస్లింలకు కేరాఫ్గా ఉన్న పాతబస్తీలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయినా ఆయనను కాంగ్రెస్ దింపే అవకాశం ఉందని సమాచారం.ప్రధానంగా మజ్లిస్ పార్టీకి ముకుతాడు వేయడమే ధ్యేయంగా సాగుతున్న రాజకీయాల్లో కాంగ్రెస్ వ్యూహ ప్రతి వ్యూహాల మేరకు అజార్ నడుస్తారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.