రాజస్థాన్ ముఖ్యమంత్రి, రాజమాత వసుంధరారాజేకు కళ్లు తెరుచుకున్నాయి. అటు ప్రజలు ఇటు ప్రతిపక్షాలు గ్యాప్ లేకుండా దుమ్ముదులిపేయడంతో వివాదాస్పద ఆర్డినెన్స్ పై పునరాలోచనలో పడ్డారు. ఏం చేయాలన్నదానిపై మంత్రివర్గ సహచరులతో చర్చిస్తున్నారు. వసుంధరారాజే మేడమ్ కు మొన్న ఎందుకనే ప్రభుత్వోద్యోగులు, న్యాయమూర్తులపై ఒక్కసారిగా అవాజ్యమైన ప్రేమ పుట్టుకొచ్చింది. అంతే ప్రభుత్వ అనుమతి లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, జడ్జిలపై వ్యక్తులు వేసే కేసులను కోర్టులు విచారణకు స్వీకరించవద్దంటూ ఆర్డినెన్స్ ఇచ్చేశారు.
అంతే కాదు మరో అడుగు ముందుకు వేసి మీడియాపైనా ఆంక్షలు విధించారు. దాన్ని అతిక్రమిస్తే రెండేళ్ల జైలుశిక్ష అంటూ అంటూ ప్రకటించేశారు. అంటే ఎవడైనా తప్పుచేస్తూ అడ్డంగా దొరికిపోయినా వాడిపై విచారణకు ప్రభుత్వం అంగీకరించాలన్నమాట. అంతేకాదు వాడిపేరు మీడియా కూడా బయటపెట్టకూడదట.ఈ ఒక్క ఆర్డినెన్స్ రాజస్థాన్ లో తీవ్రకల్లోలం రేపింది. అవినీతిపరులను ప్రభుత్వం రక్షిస్తోందంటూ విపక్షనేతలు, ప్రజలు మండిపడ్డారు. తప్పుచేసిన వారిపై విచారణ జరపొద్దనడం ఏం న్యాయం అంటూ దుమ్మెత్తిపోశారు.
అవినీతికి గేట్లు తెరుస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష కాంగ్రెస్ మేడమ్ ను కడిగిపారేసింది. ఈ ఆర్డినెన్స్ లో ఎవరినీ రక్షించే నిబంధనల్లేవని బీజేపీ సమర్ధించుకునేందుకు ప్రయత్నించినా ఎవరూ వినలేదు... కోర్టులో దీనిపై రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. పైగా కమలం హైకమాండ్ కూడా ఏం జరుగుతుందని ఆరాతీసిందట.ప్రజాగ్రహం చూసేసరికి రాజమాత కళ్లు, కాళ్లు నేలకు దిగివచ్చాయి. ఏదో చేద్దామనుకుంటే ఏదో అయ్యిందంటూ తప్పుదిద్దుకోవడానికి చర్యలు ప్రారంభించారు.
సీనియర్ అధికారులతో హుటాహుటిన సమావేశమయ్యారు. ఆర్డినెన్స్ లోని లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. బీజేపీ మంత్రులతోనూ సమావేశమైన మేడమ్... నష్టనివారణ చర్యలపై చర్చించారట. అయితే మేటర్ జనంలోకి వెళ్లాక దాన్ని సమర్ధించుకోవడం కంటే తప్పొప్పుకోవడమే బెటరని కొందరు సూచించారట. మొత్తానికి రాజవంశీకురాల్ని కదా నేను చెప్పిందే వేదం అంటే ఇలాగే ఉంటుంది.