ఏపీలో కాకలు తీరిన రాజకీయాలు చేసిన వారిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో బొత్స స్టేట్లోను, అటు సొంత జిల్లా విజయనగరంలోను ఓ రేంజ్లో చక్రం తిప్పారు. విజయనగరం జిల్లాలో అయితే మొత్తం బొత్స ఫ్యామిలీ హవానే కొనసాగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన బొత్స ఫ్యామిలీ మొత్తం చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఆ తర్వాత బొత్స వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాలను తన కనుసైగలతో శాసించిన బొత్సను వైసీపీలో సరిగా వాడుకోవడం లేదు. ఆయన వాయిస్ కూడా పెద్దగా ఎక్కడా వినపడడం లేదు.
మరో వైపు బొత్స వైసీపీ ఎంట్రీతో ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి దూరమవుతున్నారు. బొత్స వైసీపీలోకి వెళ్లిన వెంటనే బొబ్బిలి రాజులు పార్టీ మారిపోయి టీడీపీలోకి జంప్ చేసేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కూడా పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారు. ఇక జిల్లాలోను బొత్స గతంలో చేసిన పనులతో ఆయనపై వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. ఈ పరిణామాలపై ఓ అంచనాకు వచ్చిన బొత్స వచ్చే ఎన్నికల్లో విజయనగరం జిల్లా నుంచి కాకుండా పక్కనే ఉన్న విశాఖ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం రాజకీయ పార్టీలన్నింటికి ఒక ప్రతిష్టాత్మకమైనది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన భీమిలి నుంచే బరిలోకి దిగుతారా ? లేదా ఆయనకు అలవాటైనట్టుగానే నియోజకవర్గం మారతారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఇదిలా ఉంటే గంటాపై కూడా ఇటీవల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే దీనిని క్యాష్ చేసుకుని గంటాను డిఫెన్స్లో నెట్టేందుకు బొత్స ఇక్కడ నుంచి రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది.
గతంలో భీమిలి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కర్రీ సీతారామ్ పార్టీని వీడటంతో… ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై వైసీపీ చాలాకాలం నుంచి కసరత్తు చేస్తోంది. ఇక్కడ గంటాను ఢీకొట్టాలంటే బొత్స వల్లే సాధ్యమవుతుందని అటు పార్టీ అధిష్టానం కూడా భావిస్తోంది. ఇక ఇప్పటికే ఇక్కడ బొత్స తరపున ఆయన బంధువు చిన్న శ్రీను పార్టీ వ్యవహారాలు చక్కపెట్టే పనిలో ఉన్నారు. బొత్స సొంత నియోజకవర్గం అయిన చీపురుపల్లిలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించిన తన లైన్లో పెట్టుకున్నారు. ఏదేమైనా బొత్స ఓ వైపు చీపురుపల్లితో పాటు ఇటు భీమిలిపై కూడా కన్నేసి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బొత్స భీమిలి నుంచి పోటీ చేసి, ఇక్కడ గంటా కూడా బరిలో ఉంటే భీమిలి వేదికగా రాజకీయం అదిరిపోతుందనడంలో డౌటే లేదు.