ప్రస్తుతమున్న డిజిటల్ విప్లవం, స్మార్ట్ ఫోన్ల వెల్లువ, ఇంటర్నెట్ ప్రభావం ముందు ప్రింట్ మాధ్యమాలు తట్టుకుని నిలబడడం అంత తేలికైన విషయం కాదు. ముఖ్యంగా ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఓ పుస్తకమో, పేపరో చదివేతీరిక, వాటికోసం కనీసం ఓ అరగంట సమయం కేటాయించే ఓపిక కూడా ఉండడం లేదు. నిత్యం జరిగే మార్పులను చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వార్తలు వినేస్తున్నారు. ఎంటర్ టెయిన్ మెంట్ కోసం అరచేతిలో అద్భుతాలను తెరిచి.. యూట్యూబ్లో వీక్షించేస్తున్నారు. లేదా నచ్చిన చానెల్ను చేతిలోని స్మార్ట్ ఫోన్లోనే చూసేస్తున్నారు. ఇక, వీరికి పుస్తకాలతో పనేంటి?
ఈ విధానమే ప్రస్తుతం ప్రింట్ మీడియాను పెద్ద ఎత్తున దెబ్బతీస్తోంది. చిన్న పత్రికల మాట పక్క న పెడితే.. ఈనాడు వంటి అతి పెద్ద వ్యవస్థలను సైతం ఈ డిటిజల్ మీడియా విప్లవం కదిలించేస్తోంది! దీంతో ఆయా సంస్థలు ఖర్చు పెరిగినా లాభం లేక, నష్టాల బాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మెహర్నానీకి పోకుండా కొన్నింటి ప్రచురణలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. తెలుగు వెలుగే ధ్యేయంగా రామోజీ రావు ఈనాడు దినపత్రికతో పాటు కొన్ని ప్రత్యేక పత్రికలను తీసుకువచ్చారు. తెలుగు కథ, తెలుగు నవల కాన్సెప్టులుగా తెచ్చిన చతుర, విపుల వంటి వాటికి.. ఈ డిజిటల్ విప్లవం రాకముందు ఎంతో ప్రాధాన్యం ఉండేది.
నెల నెలా చతుర ఇంటికి రాకపోతే.. ఈనాడు కార్యాలయాలకు ఫోన్లు వెల్లువెత్తేవి. విపుల కనిపించకపోతే.. విచారం వ్యక్తం చేసిన పాఠకులు ఉన్నారు. కానీ, నేడు ఇవన్నీ కొనకుండానే ఆన్లైన్లో దర్శన మిస్తున్నాయి. ఫలితంగా ప్రింట్ మీడియా నుంచి విడుదలైన పుస్తకాలను కొని చదివేందుకు పాఠకులు నిరాశక్తత వెలిబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలో నష్టాల బాట పడుతున్న కొన్నింటిని వదిలించుకోవాలని రామోజీ నిర్ణయించారు. ఈ క్రమంలోనే విపుల, చతుర, సితార(సినీ పత్రిక) వంటి వాటి ముద్రణను నిలిపివేస్తారు. అయితే, వీటిని యధాతథంగా ఆన్లైన్లో మాత్రం కొనసాగిస్తారు.
ఈ దిశగా రామోజీరావు ఆలోచిస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. అదేవిధంగా గతంలో ఈనాడులో ప్రారంభించిన ప్రత్యేక పేజీల విషయంలోనూ ఈ మీడియా దిగ్గజం వెనక్కి తగ్గాలని డిసైడ్ అయిందట. ఎట్టి పరిస్థితిలోనూ నష్టాల బాటపట్టి.. మూసివేత దిశకన్నా వెనక్కి తగ్గి సంస్థలను కాపాడుకోవడమే మిన్న అనే టైపులో ఈ ప్రత్యేక పేజీల ఖర్చును కూడా తగ్గించాలని రామోజీ భావిస్తున్నారట. సో.. దీనిపై ఈ ఏడాది ఆఖరులో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఎంతో కట్టుదిట్టమైన నిర్ణయాలతో క్రమశిక్షణతో మెలిగే ఈనాడు వంటి సంస్థల్లోనే ఈ పరిస్థితి ఉంటే.. మిగిలిన వాటి పరిస్థితి ఏంటి? !