ఏపీ ఆర్థిక మంత్రి, సీనియర్ రాజకీయ నేత, సీఎం చంద్రబాబుకు రైట్ హ్యాండ్ అయిన యనమల రామకృష్ణుడుకు త్వరలోనే ప్రమోషన్ రానుందట! తన చిరకాల వాంఛ అయిన రాజ్యసభ సభ్యుడిగా ఆయన త్వరలోనే వెళ్లనున్నట్టు అమరావతి వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇది ప్రమోషన్ కాదని, చంద్రబాబు కావాలనే యనమలను వదిలించుకుంటున్నారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. విషయంలోకి వెళ్తే.. ఆర్థిక మంత్రిగా యనమల రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విభజన తర్వాత లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఆయన జాగ్రత్తగానే నడిపిస్తున్నారు. అయితే, కొన్ని విషయాల్లో ఆయన అవలంబిస్తున్న మెతక వైఖరి కారణంగా బాబు దగ్గర మైనస్ మార్కులు పడుతున్నాయి.
ముఖ్యంగా లోటు బడ్జెట్ విషయంలో రాష్ట్రానికి రూ.16 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. అయితే, కేంద్రం మాత్రం కేవలం 4 కోట్లు మాత్రమే రావాల్సి ఉందని చెబుతోంది. ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీసి గణాంక సహితంగా ఒప్పించడంలో యనమల ఫెయిల్ అయ్యారనే టాక్ హల్చల్ చేస్తోంది. ఇక, వివిధ బడ్జెట్ కేటాయింపుల్లోనూ సమగ్రత పాటించలేదనే విమర్శలు కూడా యనమలపై వినిపిస్తున్నాయి. ఇక, రాజకీయాల పరంగా సోదరుడు పళ్ల కృష్ణను అదుపు చేయలేకపోయారని కూడా వినిపిస్తోంది. ఫలితంగా కృష్ణ అనేక దందాలకు తెరదీశారని, దీంతో టీడీపీకి బ్యాడ్నేమ్ వస్తోందని బాబు దాకా చేరిపోయాయట వార్తలు.
దీంతో యనమలను ఇక్కడి నుంచి ఢిల్లీకి పంపించేస్తేనే పరిస్థితి బాగుంటుందని బాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీనికి గతంలో యనమల కోరిన కోరికనే బాబు ఇప్పుడు తెరమీదకి తెచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో తాను అసెంబ్లీకి పోటీ చేయను రాజ్యసభకు మాత్రం పంపండి అని బాబును కొరారట యనమల. అయితే, విభజన నేపథ్యంలో ఏపీ ఆర్థిక వ్యవహారాలను ఎవరికి బడితే వారికి అప్పగిస్తే. ఇబ్బందులు వస్తాయని భావించిన చంద్రబాబు యనమలకు కట్టబెట్టారు.
అయి, ఇప్పుడు యనమలను పంపేస్తేగానీ, ఆర్థిక పరిస్థితి చక్కబడని బాబు అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే 2014 ఎన్నికలకు ముందునుంచే రాజ్యసభ్య సభ్యత్వంపై తన కోరికను చెప్పారు కాబట్టి యనమలను ఢిల్లీ పంపాలని బాబు డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలోనే వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో యనమలకు సీటు ఖరారు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
వచ్చే ఏడాది ఏప్రిల్లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండడంతో వాటిల్లో ఒకదానిని యనమలకు కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి యనమల కూడా ఓకే చెబుతున్నారట. సో.. యనమల ప్లేస్ త్వరలోనే ఖాళీ కానుందని అంటున్నారు తమ్ముళ్లు. మరి దీనిని ఎవరికి కేటాయిస్తారో చూడాలి. ఎలాగూ ఆనం సోదరుల్లో పెద్దవాడైన రామనారాయణ రెడ్డి ఈ పోస్టు కోసం కాచుకుని కూర్చున్న విషయం తెలిసిందే.