రాజకీయాల్లో కెసిఆర్ వ్యూహాత్మకంగా ప్రవర్తించటం సర్వసాధారణం. అతని ప్రతిచర్య వెనుకా సుదూరంగా ఆలోచించి ప్రణాళిక సిద్ధం చేసిగాని ఆ పని అమలు చేయ్యరు. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి, తెలుగుదేశం పార్టీకి "గుడ్-బై" చెప్పి, కాంగ్రెస్ పార్టీలో చేరిన తరవాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేమపూర్వకంగా అభినందనతో కూడిన షాఖ్ ఇచ్చారు.
ఈ ఇద్దరు నేతల పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్న సంగతి తెలిసిందే. "ఓటుకు నోటు కేసు" తర్వాత కేసీఆర్, టీఆర్ఎస్ నేతలకు, రేవంత్ కు మధ్య వాతావరణం ఉప్పు-నిప్పులా మారింది. సమయం చిక్కినప్పుడల్లా అటు టీఆర్ఎస్ నేతలు, ఇటు రేవంత్ రెడ్డి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటారు. రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరటం అనేదానికి కెసిఆర్ ను టార్గెట్ చేయటానికేనని మనందరికి తెలుసు.
కాంగ్రెస్ లో చేరిన సమయంలోనూ ‘ఇక ఆట మొదలైంది’ అని పరోక్షంగా టీఆర్ఎస్, కేసీఆర్ను హెచ్చరించారు. కేసీఆర్ సైతం అప్రకటితంగా రేవంత్ పై అలాంటి యుద్ధమే కొనసాగిస్తున్నారు. ఇలా ఆసక్తికరమైన పరిణామాలు, ప్రచ్ఛన్నయుద్ధాలు ఆగిపోయి ప్రత్యక్ష యుద్ధాలు కొనసాగుతున్న సమయంలో కేసీఆర్ ఒక అనూహ్యమైన వ్యూహాత్మక ట్విస్ట్ ఇచ్చారు.
రేవంత్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ, పుష్ప గుచ్చాన్ని పంపించారు. "దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. మీరు ప్రజాసేవలో మరెన్నో ఏళ్లపాటు కొనసాగాలి" అని కేసీఆర్ రేవంత్కు పంపిన లేఖలో కోరుకున్నారు. కేసీఆర్ ఇలా లేఖ పంపడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. టీడీపీలో ఉన్నప్పుడు గానీ, అందుకు ముందుగానీ రేవంత్కు కేసీఆర్ ఇలా శుభాకంక్షలు చెప్పిన దాఖలాలు లేవు. అయితే రేవంత్ కాంగ్రెస్లో చేరిన తర్వాత జరుపుకుంటున్న "తొలి బర్త్-డే" కు కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు పంపించడం ఆసక్తికరంగా మారింది. ఇందులో రెవంత్ కి కాంగ్రెస్కు మద్య మిత్రభేధం సృష్టించటానికి కాదు గదా! అని అనుభవమున్న రాజనీతిఙ్నులు అంటున్నారు.