తమిళనాడు రాజకీయాల్లో తనదైన మార్క్ వేసుకోవాలని.. స్వర్గీయ జయలలిత మరణం తర్వాత ఆమె నెచ్చెలి శశికళ అలియాస్ చిన్నమ్మ తమిళనాడు సీఎం పదవి కోసం ఎన్నో గేమ్స్ ఆడింది. కాకపోతే తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్లు అక్రమాస్తుల కేసులో 4 సంవత్సరాలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం అక్రమ ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు శశికళ. ఇప్పుడు చిన్నమ్మకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. చిన్నమ్మ శశికళ కుటుంబీకులు చిక్కుల్లో పడ్డారు. వారి మెడకు ఐటీ ఉచ్చు బిగియనుంది.
సోదాల్లో లభించిన ఆధారాల మేరకు ఒక్కొక్కర్ని వేర్వేరుగా విచారించేందుకు అధికారులు నిర్ణయించారు. ఆ కుటుంబానికి చెందిన వారందరికీ సమన్లు జారీచేస్తున్నారు. జయ టీవీ, జాస్ సినిమాస్ సీఈవో వివేక్ను తమ కార్యాలయంలో ఉంచి ఐటీ వర్గాలు విచారించే పనిలో పడ్డాయి. దివాకరన్ను విచారించేందుకు రంగం సిద్ధం అయింది. ఆ మద్య బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ ఇటీవల ఐదు రోజుల పెరోల్ పై అనారోగ్యంతో బాధపడుతున్న భర్త నటరాజన్ ను చూసేందుకు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో శశికళ మాస్టర్ మైండ్ వినియోగించారు. దినకరన్ తో అన్నాడీఎంకేలోని పళనిస్వామి, పన్నీరు సెల్వంలకు విభేదాలు రావడంతో ఎప్పటికైనా ఇబ్బంది అని భావించిన ఆమె.. ప్లాన్ అమలు చేశారు. భర్త అనారోగ్యం కారణం చూపి పెరోల్ పై బయటకు రాగానే ఒకే ఒక్కసారి భర్త వద్దకు వెళ్లిన ఆమె ఆ తర్వాత వ్యక్తిగత పనులు చూసుకున్నారు. అందులో భాగంగా 622 ఆస్తులను ఇతరుల పేర్లకు మార్చారు.
కాకపోతే శశికళ పై గట్టి నిఘా వేసి ఉంచిన అధికారులు, ఆమె ప్రతి అడుగును క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో ఆమె నివాసం, కార్యాలయాలు, సన్నిహితులు, బంధువులు, లాయర్లు తదితరులపై ఐటీ దాడులు నిర్వహించారు. అంతే కాదు ఈ దాడుల్లో 1400 కోట్ల రూపాయల పన్ను ఎగవేసినట్టు గుర్తించగా, సుమారు 30,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేసినట్టు గుర్తించినట్టు తమిళనాట వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ఆమె ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న పరప్పణ అగ్రహార జైలు సూపరింటెండెంట్ కు లేఖ పంపి విచారణకు అనుమతి పొందనున్నారని సమాచారం. మొత్తానికి చిన్నమ్మ వేసిన ప్లాన్లు మొత్తం రివర్స్ కావడం మరిన్ని సమస్యల్లో చిక్కకున్నట్లయ్యింది.