ఉమ్మడి ఏపీ చిట్ట చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీలో పొలిటికల్ చిచ్చు రేగింది. 2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా వీరి కుటుంబంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో నల్లారి ఫ్యామిలీకి మంచి పలుకుబడి ఉంది. ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి కోటరీ బలంగా ఉంది. అదేసమయంలో ఈయన సోదరుడు నల్లారి కిశోర్ రెడ్డి కూడా బలంగానే ఉన్నారు. ఇక, ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు పార్టీ వైరం తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. విషయంలోకి వెళ్తే.. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి నల్లారి కుటుంబం విధేయతగానే ఉంది.
అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్య రాష్ట్రానికి మద్దతుగా ఈ కుటుంబం నిలిచింది. ప్రధానంగా రాష్ట్ర విభజన వద్దంటూ.. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం హోదాలోనే వ్యతిరేకించారు. అయినా.. అప్పటి యూపీఏ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపింది.దీంతో కిరణ్ ఆపార్టీకి రాజీనామా చేసి.. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అయితే, దీనికి ప్రజల నుంచి ఎలాంటి ఆదరణా లభించలేదు. ఫలితంగా ప్రస్తుతం కిరణ్ తెరమాటునే ఉండిపోయారు. ఇక, ఈయన సోదరుడు కిశోర్ రెడ్డి కూడా ఇప్పటి వరకు యాక్టివ్గా తిరిగింది లేదు. ఇదిలావుంటే, చిత్తూరు జిల్లాలో బలపడాలని చూస్తున్న చంద్రబాబు.. ఆ దిశగా చర్యలు ప్రారంభించారు.
దీంతో నల్లారి ఫ్యామిలీ నుంచి కిశోర్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకునే అంశంపై చర్చసాగుతోంది. గత ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కిశోర్కు 44వేల ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన అప్పటి నుంచి యాక్టివ్గా ఉండడంలేదు. ఇక, ఇప్పుడు 2019 ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో తన రాజీకీయ భవితవ్యంపై కిశోర్ రెడ్డి దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే మంత్రి అమరనాధరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని వెంట ఉండి కిశోర్ను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. మరో వారం రోజుల్లో కిశోర్ అధికారికంగా తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.
మరోపక్క, ఇటు అధికార పార్టీ టీడీపీలోకి వెళ్లలేక, అటు విపక్షం వైసీపీలోకి చేరలేక.. ఇబ్బంది పడుతున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. తాజాగా మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరాలని నిర్ణయించుకున్నాడట. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే సరేసరి. లేకుంటే ఏఐసీసీలో కీలక పదవి తనకు దక్కేలా కూడా కిరణ్ ఒప్పందం చేసుకున్నట్టు సాసమాచారం ఈ పరిణామ. ఈ పరిణామం ఇప్పుడు నల్లారి కుటుంబంలో కాక పుట్టిస్తోంది. అన్న ఇటు.. తమ్ముడు అటు అన్నట్టుగా రాజకీయం మారేసరికి కేడర్ పరిస్థితి ఏమిటి? అనే సందేహాలు తెలత్తుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.