రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఎప్పుడు ఏం జరిగినా అది నాయకుల మంచి కోసమే అని అనుకోవాలి! వారి లబ్ధి కోసమే వారలా చేశారని సంబాళించుకోవాలి! ఇప్పుడిదంతా ఎందుకంటే.. 2019 ఎన్నికలు ముంచుకువస్తున్నాయి కాబట్టి!! ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయ ముఖ చిత్రాలు శరవేగంగా మారిపోతున్నాయి. నేతలు కప్పల కన్నా వేగంగా గంతులు పెడుతున్నారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ మారతారో? ఎవరు ఎప్పుడు ఏ గుర్తు నుంచి పోటీ చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా ఏపీ కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించిన చిత్తూరుకు చెందిన పొలిటికల్ ఫ్యామిలీ నల్లారి వారి ఇంటి రాజకీయాలు మారిపోయాయి. జెండాలు మారిపోయాయి. అజెండాలూ మారిపోయాయి. ఏకంగా మనుషులే పూర్తిగా మారిపోయారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ఏ ఒక్కరిని పలకరించినా.. నల్లారి ఫ్యామిలీ ముచ్చట్లే ఇప్పుడు చర్చించుకుంటున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఏపీ చివరి సీఎంగా రికార్డు సృష్టించారు. అదేవిధంగా ఆయన సోదరుడు కిశోర్ రెడ్డి కూడా అన్నగారు సీఎంగా ఉన్న సమయంలో మాంచి దందాలు చేశాడని, అసలు అన్న సీఎం అనే మాటేకానీ, జిల్లాలో అన్నీతానై చక్కబెట్టాడని కథలు కథలు చెప్పుకొన్నారు.
ఇక, రాష్ట్ర విభజనతో ఇద్దరూ తెరచాటుకు వెళ్లిపోయారు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి.. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు తప్పదు. ఇదే ఇప్పుడు నల్లారి ఫ్యామిలీని మళ్లీ వేదిక ఎక్కించింది. అయితే, గతంలో తాము పదవులు అనుభవించిన కాంగ్రెస్ను ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరూ వదిలేశారు.మరీ ముఖ్యంగా కిశోర్ రెడ్డి ... నాలుగు ఆకులు ఎక్కువ చదివారో ఏమో.. గెలుపు గుర్రంగా కనిపిస్తున్న టీడీపీ చెంతకు వచ్చేశారు. అయితే, ఈయన వచ్చేయడం ఏదో మొన్నామధ్య వంతల రాజేశ్వరి వచ్చేసినంత వీజీగా మాత్రంకాదు! టీడీపీ అన్నా ఆపార్టీ అధినేత అన్నా నల్లారి ఫ్యామిలీ అగ్గిమీద గుగ్గిలంగా మండిపడేది.
అయితే,మారిన రాజకీయాలు, పదవుల కాంక్ష వీరిని బాబు చెంతకు చేరేలా.. గతాన్ని మరిచిపోయేలా చేశాయి. ఇప్పటికిప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కిశోర్ రెడ్డి, ఆయన తనయుడు అమర్నాథ్ రెడ్డిలు టీడీపీ సైకిల్ ఎక్కేసేందుకు రెడీ అయిపోయారు. ముహూర్తమే తరువాయి అన్నట్టుగా మాత్రమే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇక, వీరు కూడా నిన్న తెలంగాణలో ఉమా మాధవ రెడ్డి చెప్పినట్టు.. హామీలు లేకుండా మాత్రం బాబు చెంతకు చేరడం లేదు. తండ్రీ కొడుకులు ఏకంగా రెండు టిక్కెట్లకు సంబంధించి హామీలు తీసుకునే కండువాలు మార్చుకుంటున్నారు.
అమర్నాథ్ రెడ్డికి పీలేరు అసెంబ్లీ సీటును, కిశోర్ రెడ్డికి రాజం పేట ఎంపీ సీటును బాబు ఆఫర్ చేసేశారని అమరావతి వర్గాలు చెబుతున్నాయి. దీంతో త్వరలోనే వీరు పార్టీ కండువాలు మార్చుకుని జైటీడీపీ నినాదాలను చేసే ప్రయత్నంలో ఉన్నారని అంటున్నారు. సో.. ఇలా పీలేరు రాజకీయాలు, ముఖ్యంగా నల్లారి ఫ్యామిలీ రాజకీయాలు వాడి వేడిగామారిపోయాయి. కొసమెరుపు ఏంటంటే.. రేపో మాపో.. కిరణ్కుమార్ రెడ్డి కూడా బాబు చెంతకు చేరే సూచనలు కనిపిస్తున్నాయట. దీనికి మంత్రి వర్గంలో కీలకంగా ఉన్న అమర్నాథ్రెడ్డి కీ రోల్ పోషిస్తున్నాడట!! సో.. రాజకీయాలన్నాక ఏమైనా జరగొచ్చు!! గుర్రం ఎగరావచ్చు!! మనం చూస్తూ ఉండడమే!!