తెలుగు మీడియాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి భయటకు వచ్చింది. తెలుగులో ఇప్పటికే లెక్కకు మిక్కలిగా ఎంటర్టైన్మెంట్ & న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. అసలు జనాలకు ఏ ఛానెల్ చూడాలో ? కూడా తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరో కొత్త ఛానెల్ పుట్టుకు వస్తోంది. మామూలుగా ఓ ఛానెల్ వస్తుందంటే పెద్దగా జనాలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తెలుగులో ఇటీవల పుట్టగొడుగుల్లో ఛానెల్స్ వస్తున్నాయి. అయితే తాజాగా వచ్చే ఛానెల్ మాత్రం ఆసక్తికర కాంబినేషన్లో రావడం విశేషం.
అదీ కూడా ఈ ఛానెల్ ఇద్దరు మీడియా రంగంలో ఉన్న ప్రముఖులతో పాటు ఏపీలో ఓ రాజకీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే భాగస్వాములుగా ఈ ఛానెల్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే సాధారణ ఎన్నికల నేపథ్యంలో చాలా కొత్త ఛానెల్స్ వస్తున్నా ఈ ఛానెల్ మాత్రం అటు మీడియా వర్గాలతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లోను పెద్ద ఆసక్తి రేపుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఏపీ 24/7 ఛానెల్ ప్రారంభమైపోయింది. మరి కొన్ని కొత్త ఛానెల్స్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. మరో 10 ఛానెల్స్ వరకు శాటిలైట్ సిగ్నల్స్ పర్మిషన్ కోసం దరఖాస్తులు చేసుకున్నాయి.
ఇక తాజా ఛానెల్ విషయానికి వస్తే వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు(నాని)తో కలసి ఎన్టీవీ చౌదరి, టీవీ9 సీఈవో రవిప్రకాష్ ఈ కొత్త ప్రాజెక్టు ప్రారంభించారు. 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. కొత్త మీడియాను తీసుకు వస్తే టైమింగ్ పరంగా తిరుగు ఉండదన్న మాట వినిపిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ కంపెనీలో తాజాగా ఒక యువ ఎంపీ కూడా చేరనున్నట్లు సమాచారం.
ఇక ఈ ఛానెల్ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ అని, సినిమా రంగాన్ని టార్గెట్గా చేసుకుని ఇది ఏర్పాటు చేస్తున్నారని కొందరు చెపుతుంటే, కాదు కాదు ఎన్నికల నేపథ్యంలో దీనిని న్యూస్ కోణంలో కూడా బాగానే వాడుకుంటారని మరికొందరు చెపుతున్నారు. ఇక న్యూస్ ఛానెల్స్ పరంగా టీవీ-9, ఎన్టీవీ పోటాపోటీగా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఈ రెండు ఛానెల్స్కు చెందిన ప్రముఖులు, వైసీపీ ఎమ్మెల్యే ముగ్గురూ కలిసి ఏర్పాటు చేసే ఈ కొత్త ఛానెల్ ఎన్ని సంచలనాలకు కారణమవుతుందో ? చూడాలి.