వడ్డించే వాడు మనవడు అయితే ఆకు చివరన కూర్చున్నా పర్లేదు అని పెద్దలు సామెత ఊరికే చెప్పలేదు. ఇలాంటి కొన్ని సంఘటనలు చూసే చెప్పి ఉంటారు. చాలా మంది ప్రజా ప్రతినిధులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న చోట చాలా సమస్యలు ఉన్నాయి మొర్రో అని మొత్తుకుంటున్నప్పటికీ...వాటిని పట్టించుకోరు. కానీ తమవాళ్లు అనుకుంటే మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలిసేందుకు ఇదే నిదర్శనం. తాజాగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ సామెత గుర్తుచేసే పనే చేశారు.
కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకునేందుకు కారణం ఎవరో కాదు..ఆయన సోదరి అయిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. విషయం ఏంటంటే జగిత్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లోని సమస్యలను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ను ఎంపీ కవిత కలిశారు. అనేక సమస్యలు ప్రస్తావిస్తూ నిధులు కావాలని కోరగా కేటీఆర్ వెంటనే రూ.150 కోట్లు ఇటీవల మంజూరు చేశారు.దీంతో జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి మున్సిపాలిటీలకు నిధుల వరద పారనుంది. కేటీఆర్ రూ.150 కోట్లు ప్రత్యేక నిధులను మంజూరు చేసిన నేపథ్యంలో హైదరాబాద్లో ఎంపీ కవిత నేతృత్వంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల సమన్వయ సమావేశం కూడా నిర్వహించారు.
ఈ నిధులతో మున్సిపల్ ఆఫీసులు ఈ-ఆఫీసులుగా మారనున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకునే సౌకర్యం కూడా సిద్ధంకానుంది. టాయిలెట్స్ అవసరమున్న చోట ఏర్పాటు చేస్తారు. ప్రతి మున్సిపాలిటీలో స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తారు. మినీ టాంక్ బండ్లు, పార్కులు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఈ లైబ్రరీలు, బస్ షెల్టర్లు, మహిళా క్రీడా ప్రాంగణాలు, ఫంక్షన్ హాల్స్, పెళ్లిళ్ల కోసం ప్రత్యేక ప్రాంగణాలు నిర్మిస్తారు. టౌన్లలోని ప్రధాన రోడ్లను అభివృద్ధి చేస్తారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల సుందరీకరణ లక్ష్యంగా స్పెషల్ ఫండ్ను వినియోగిస్తారు.
ఇదంతా బాగానే ఉన్నప్పటికీ...ఈ మూడు మున్సిపాలిటీలు ఏం పుణ్యం చేసుకున్నాయి ఏమో కానీ నిధులు మాత్రం బాగానే పనయ్యాయి. అయితే ఈ నిధుల విడుదల వ్యవహారం పై మిగతా ఎమ్యెల్యేలు మాత్రం గుర్రుగా ఉన్నారు. తాము అనేక మార్లు అనేక సమస్యలు ఏకరుపెడితే లోటు బడ్జెట్ అంటూ దాటవేశారని అదే కవిత అడగగానే అంత పెద్దమొత్తం లో నిధులు ఎలా విడుదల చేశారని చెవులు కొరుక్కుంటున్నారు.
అసలు కథ ఇదేనా...
ఇక కవిత వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నియోజకవర్గంలో పట్టు పెంచుకునే క్రమంలోనే ఆమె ముందస్తు ప్లాన్లో భాగంగానే ఇక్కడ భారీగా అభివృద్ధి పనులకు తెరదీసినట్టు స్పష్టమవుతోంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సీనియర్ నేత జీవన్రెడ్డి ఉన్నారు. ఆయనపై పోటీచేసి గెలవడం కవితకు మరీ అంత సలువు కాదు. ఈ క్రమంలోనే ఇక్కడ భారీగా అభివృద్ధి పనులు చేస్తే ఆ పనులతో తాను జనాల్లోకి వెళ్లవచ్చని కవిత మాస్టర్ ప్లాన్ వేశారు.