వైసీపీలో జంపింగ్లు ఆగడం లేదు. ఓ వైపు పార్టీని పటిష్టం చేసేందుకు జగన్ భారీ పాదయాత్ర చేస్తుంటే మరోవైపు నాయకులు ఒక్కొక్కరు జంపింగ్ చేసేస్తున్నారు. ఎప్పుడు ఎవరు జగన్కు షాకులు ఇస్తారో ? కూడా వైసీపీలో అర్థం కావడం లేదు. తాజాగా ఓ ఇన్చార్జ్ నియామకం వైసీపీలో చిచ్చుపెట్టింది. దీంతో పలువురు కీలక నేతలు పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితి రోజు రోజుకు చాలా దయనీయంగా మారుతోంది. అసలు ఆ పార్టీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన రేంజ్లో ఉన్న బలమైన అభ్యర్థులు కూడా వచ్చే ఎన్నికల్లో దొరికే పరిస్థితి లేదు.
తాజాగా ఓ నియోజకవర్గ ఇన్చార్జ్ నియామకంలో చెలరేగిన చిచ్చుతో ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కీలక నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలోకి జంప్ చేసేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం అసెంబ్లీ సీటును గత ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది. కలమట వెంకటరమణ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజును ఓడించారు. ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో ఆయన సైకిల్ ఎక్కేశారు. ఆ తర్వాత అక్కడ వైసీపీ ఇన్చార్జ్ నియామకం చాలా మంది నాయకులు పోటీపడుతున్నారు.
అయితే జగన్ వాళ్లందరికి షాక్ ఇస్తూ గత ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన రెడ్డి శాంతికి పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి వైసీపీ పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పదవి సలాన మోహనరావు ఆశించిన విషయం విదితమే. అయితే మోహనరావును పక్కనపెట్టి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతిని నియమించినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు సలాన వర్గం దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే మెళియాపుట్టి ఎంపీపీ సలాన రాజేశ్వరి, ఆమె భర్త మాజీ ఎంపీపీ సలాన మోహన రావుతో పాటు పీఏ సీఎస్ అధ్యక్షుడు ఉర్లాన బాలరాజు, ముగ్గురు సర్పంచ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈనెల 23న టీడీపీలో చేరనున్నారు.
వీరిని టీడీపీలోకి తీసుకు వచ్చేందుకు పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇక ఇటీవల నియోజకవర్గంలో వైసీపీ నిర్వహించిన నవరత్నాలు సభకు కూడా సలానకు ఆహ్వానం అందలేదు. దీంతో అటు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు దక్కపోవడంతో పాటు ఇటు పార్టీలోను అవమానాలు ఎదురుకావడంతో చివరకు సలాన తన టీంతో సహా టీడీపీలో చేరిపోనున్నారు. వైసీపీలో ఈ పరిస్థితి జిల్లాలో పాతపట్నం నియోజకవర్గంలో మాత్రమే కాదు. అన్ని నియోజకవర్గాల్లోను ఇలాగే ఉంది.