గుజరాత్ లో ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్, బిజెపిల మద్య హోరా హోరి యుద్దం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రచారం లో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహూల్ గాంధి ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. త్వరలో ప్రధాని మోడీ కూడా ప్రచారంలోకి దిగుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా పటేళ్లకు రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని పటేల్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ స్పష్టం చేశారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరినట్లు ఆయన ఇవాళ మీడియాకు తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్తో ఒప్పందంపై హార్దిక్ పటేల్ సోమవారమేప్రకటన చేయాల్సింది. అయితే ఆందోళనల కారణంగా తన సభను రద్దు చేసుకొని బుధవారం ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. ఒకవేళ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే, పటేళ్లకు కోటా ఇస్తామని కాంగ్రెస్ పేర్కొన్నట్లు హార్దిక్ తెలిపారు. సెక్షన్ 31, సెక్షన్ 46 కింద రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకారం తెలిపిందన్నారు.
ఉద్యోగాలు, విద్యలో కోటా పొందని వారికి ఓబీసీ ప్రకారం ప్రయోజనాలు కల్పించనున్నట్లు హార్దిక్ పటేల్ తెలిపారు. అయితే, ఇటీవల సీట్ల ఒప్పందం విషయంలో భేదాభిప్రాయాలు చోటుచేసుకోవడంతో పటేల్ వర్గీయులు ఇటీవల కాంగ్రెస్ కార్యాలయాలపై దాడి చేశారు. దీంతో పటేల్ వర్గం కాంగ్రెస్కు మద్దతు ఇవ్వబోదనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఊహాగానాలకు తెరదించుతూ తాము కాంగ్రెస్తోనే ఉంటామని హార్దిక్ పటేల్ స్పష్టం చేశారు.