నేడు మంగళవారం అట్టహాసంగా హైదరాబాద్ వేదికగా "ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు–జీఈఎస్ 2017" జరగబోతున్న ఇచ్చొత మహిళలే మహనీయులు. తొలిసారి మైనారిటీ బందనాల సంకెళ్ళు తెంచుకొని మెజారిటీగా దూసుకువచ్చారు. అమెరికా ప్రభుత్వం ఏటా నిర్వహించే ఈ సదస్సు, దక్షిణాసియాలో జరగటం, అదీ మన భాగ్య నగరం లో జరగటం ఒక ప్రత్యేకత ఒక సందర్భం. ఇదే ప్రథమం. ముఖ్యంగా పది దేశాల నుంచి వస్తున్న పారిశ్రామికవేత్తల బృందాల్లో మహిళామణు లేతప్ప పురుషపుంగవులు ఏమాత్రమూ లేరు.
హెచ్ఐసీసీలో మూడు రోజులపాటు జరిగే జి.ఈ.ఎస్.ను ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారు. ప్రారంభ వేడుకల్లో వీరితో పాటు కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్ సహా పలువురు ముఖ్యులు పాల్గొంటారు.
ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల నుంచి దాదాపు 1700 మంది ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సులో, నూతన సృజనాత్మక ఆవిష్కరణలు, నవ్య క్రొంగొత్త ఆలోచనలతో ప్రపంచానికి నూతన దిశానిర్దేశం చేయటానికి పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రేరణ పొందదలుచుకున్న వారెందరో పాల్గొంటారు. సోమవారం సాయంత్రానికే వీరిలో చాలా మంది హైదరాబాద్కు చేరుకున్నారు.
భారత్–అమెరికా ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సు కావటంతో దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు అతిథులకు "నభూతో నభవిష్యతి" అనిపించేలాగా ఘనమైన ఆతిథ్యమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భాగ్యనగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది. "నీతి ఆయోగ్" నిర్వహణ ఏర్పాట్లకు సారథ్యం వహించింది. 2010 వాషింగ్టన్లో తొలిసారి ఈ సదస్సు నిర్వహించటం ప్రారంభించిన అమెరికా, తర్వాత ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీలో తదుపరి సదస్స్జులు నిర్వహిస్తూవచ్చింది. తమ ఎనిమిదో సదస్సుకు హైదరాబాద్ ను ఎంచుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 52.5 శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలే హాజరవుతుండటంతో సదస్సు ప్రపంచ మహిళా చరిత్ర మహిళా సాధికారతకు వన్నె తెచ్చేలా ప్రెరణ స్పోరకంగా అందరినీ ఆకర్షించేలాగా భారత చరిత్రలో మహిళల కోసం ఒక మైలురాయిగా నిలువనుంది.
మహిళలు తమ కాళ్లపై తాము నిలదొక్కుకుని, ఆర్థిక సాధికారతను సాధిస్తే, ఆయా సమాజాలు, దేశాలు ఆర్ధికంగా వృద్ధి సాధిస్తాయని చెప్పాలనేది ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. ఈ దిశగా భారత్, అమెరికా ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని చాటి, ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆశిస్తున్నాయి. ఇప్పటికే మేక్-ఇన్- ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలతో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం సదస్సుపై భారీగానే ఆశలు పెట్టుకుంది.
దేశంలో నెలకొని ఉన్న స్టార్టప్ కంపెనీలు మరో సోఫానం అధిగమించేందుకు, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు వారికి ఆర్థిక ఆలంబనగా గా నిలిచి సహకరించేందుకు ముందుకు వస్తారని ఆశాభావంతో ఉంది. "ది ఇండియా ఎడ్జ్" పేరుతో దేశంలో ప్రఖ్యాతి సాధించిన వంద స్టార్టప్ కంపెనీలకు ఈ సదస్సులో పాలుపంచుకునే అరుదైన అవకాశం ఈ సదస్సు కల్పించింది. ఈ స్టార్టప్లన్నీ ప్రపంచం దృష్టిని ఖచ్చితంగా ఆకర్షిస్తాయని, దీంతో నూతన ఆవిష్కరణలు, నవ్య పోకడలకు, తాజా ఆలోచనలకు భారత్ డెస్టినేషన్ గా నిలుస్తుందనే భావిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదలుకొని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ సదస్సుకు ఆహ్వానించింది. దేశ విదేశాల నుంచి 200 మంది అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు, విశ్లేషకులు రానున్నారు.
హైదరాబాద్లో మెట్రో రైలును ప్రారంభించిన అనంతరం ప్రధాని నరెంద్ర మోదీ, నేరుగా ఈ సదస్సుకు హాజరవుతారు. ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి కేసీఆర్ అతిధులను ఆహ్వానిస్తూ స్వాగతోపన్యాసం చేస్తారు. భారత్, అమెరికా జాతీయ పతాకాలను ఎగరేస్తారు. తర్వాత అమెరికా ప్రతినిధిగా ఇవాంకా ట్రంప్, చివరగా ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ధన్యవాదాలు తెలియజేస్తారు.
తదనంతరం వివిధ దేశాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు ఉన్న అవకాశాలపై "ప్లీనరీ సెషన్" మొదలవుతుంది. సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ మోడరేటర్ గా వ్యవహరించే ఇందులో... ప్యానెల్ స్పీకర్లుగా ఇవాంక, ఎస్సారెస్ ఏవియేషన్, పెట్రోలియం ఎండీ శిబొంగ్లే సాంబో, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, స్కాండినెవియా బ్యాంక్ ఛైర్మన్ మార్కస్ వ్యాలెన్ బర్గ్ ఉంటారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఇన్నోవేషన్స్ ఆన్ వర్క్ఫోర్స్ డెవెలప్మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ అనే చర్చా గోష్ఠిలోనూ ఇవాంకా పాల్గొంటారు. ఈ చర్చకు పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మోడరేటర్ గా వ్యవహరిస్తారు. ప్యానెల్లో ఇవాంకతో పాటు చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్, డెల్ సీసీవో కరెన్ క్వింటోస్ ఉంటారు.
విశ్వ దృష్టిని తమవైపుకు తిప్పుకునేలా ఆకర్షనీయ నవ్య వినూత్న పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా సదస్సుపై భారీ ఆశలే పెట్టుకుంది. ఈ అవకాశం భవిష్యత్తులో రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు తెచ్చి పెడుతుందని, ఈ శిఖరాగ్ర సదస్సు ద్వారా ఇక్కడున్న అపారమైన మానవ, ఆర్ధిక, ప్రకృతి, ప్రాదేశిక పరమైన వనరులు, నూతన పెట్టుబడుల కున్న అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పాలని ఉవ్విళ్లూరుతోంది.