జనసేనాని పవన్ వైఖరి టీడీపీకి మింగుడు పడడం లేదు. గత రెండు రోజులుగా ఏపీలో సుడిగాలి పర్యటన చేస్తున్న పవన్.. వివిధ అంశాలపై తనదైన స్టైల్లో స్పందిస్తున్నారు. అక్కడికక్కడే మీటింగులు పెట్టి మాట్లాడుతున్నారు. అయితే, పవన్ చేస్తున్న వ్యాఖ్యల్లో అధికార టీడీపీని ఇరుకున పెట్టే విషయాలు ఉంటుండంతో సంచలనంగా మారుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన పవన్.. పోలవరం విషయంలో సీఎం చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. శ్వేత పత్రం విడుదల చేస్తే బాగుండేదన్నారు.
కేంద్రం డబ్బులు ఇచ్చినప్పుడు లెక్కలు అడిగితే తప్పేంటని, లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా అన్నారు. ఈ రెండు వ్యాఖ్యలు కూడా బాబును తీవ్రంగా ఇరుకున పెట్టేవే. ఇక, ముచ్చటగా మూడో రోజు పర్యటనలో పవన్ ఒంగోలులో మాట్లాడుతూ.. మరిన్ని బాంబులు పేల్చాడు. టీడీపీకి మద్దతిచ్చిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. 2014లో టీడీపీకి కొన్ని అనూహ్యమైన పరిస్థితుల నేపథ్యంలోనే తాను మద్దతిచ్చానని చెప్పారు. తనకు ఖలేజా ఉందని, అనుకుంటే టీడీపీకి గండికొట్టి వెళ్లగలనని అన్నారు.
నిజానికి సీఎం చంద్రబాబు.. పవన్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని ఎప్పటికీ అనుకుని ఉండరు. ఇక, పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియపైనా పవన్ మండిపడ్డారు. బోటు ప్రమాదానికి మంత్రి అఖిలప్రియ బాధ్యత వహించాలన్నారు. కేవలం ఎక్స్ గ్రేషియో ప్రకటించినంత మాత్రాన ప్రాణాలు తిరిగి తీసుకురాగలరా? అని ప్రశ్నించారు. భూమా కుటుంబం వైసీపీ ఎమ్మెల్యేలుగా నిలబడినప్పుడు తనను ప్రచారానికి రావద్దని కోరారని, తాను వస్తే ఓట్లు పోతాయని వారు చెప్పడంతో తాను వెళ్లలేదన్నారు. వారి మాటలకు తాను ఎంతగానో గౌరవం ఇచ్చానని, అలాగే ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా తాను మానవతా థృక్ఫథంతోనే అభ్యర్థిని నిలబెట్టలేదని చెప్పారు.
రెండుసార్లు అఖిలప్రియ కుటుంబానికి సాయం చేశానన్నారు. అలాంటి మీకు మానవతా థృక్ఫథం కొరవడిందన్నారు. విచ్చలవిడిగా ప్రయివేటు బోట్లు తిరుగుతుంటే, లైఫ్ జాకెట్లు ఇవ్వకుండా నదిలోకి తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు శరాఘాతాలుగా తగిలే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ వ్యాఖ్యలకు విలువ ఇస్తే.. అఖిల రాజీనామా చేయాల్సిందే. మరి ఏం చేస్తుందో..? ఏం జరుగుతుందో చూడాలి!