తెలంగాణా నూతన రాష్ట్రం ఏర్పడింది. అంతే నూత్నంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించటానికి సిద్ధమైంది. ముఖ్యంగా తెలంగాణా ముఖ్యమంత్రికి తెలుగు భాషాభిమానం కాస్త ఎక్కువే. అంతే కాదు సాహిత్యం అంటే మక్కువ కూడా ఎక్కువే. ఈ విషయం ఆయన సహజంగా ఇచ్చే ఉపన్యాసలలోనే ఒక తరహా క్రమపద్దతిలో సాగే మాండలికం, యాస, ప్రాస అన్నీ కలిపి ఆయనలోని బాషాభిమానాన్ని బాషాభినివేశాన్ని తెలపకనే తెలుపుతాయి. ఆయనలోని అంతఃకరణే ఆయన్ను ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు పురికొల్పిందనవచ్చు.
ఈ మహాసభలకు రాష్ట్రప్రభుత్వం తరపున విదేశాలకు చెందిన 37మందిని అదే విధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన 56 మంది ని ప్రధాన అతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 7920 మంది ప్రతినిధులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. దేశ, విదేశీ అతిథులకు ప్రభుత్వపరంగా ఏర్పాట్లు చేయనున్నామన్నారు. ఈ నెల 15వ తారీఖు నుండి ఐదు రోజుల పాటు అంటే 19వ తారీఖువరకు నిర్వహించబడే ఈ మహాసభ కార్యక్రమాల సూచికను ముందుగానే తెలుపుతామని ప్రతినిధు లుగా నమోదు చేసుకోనివారు కూడా మహాసభలకు హాజరు కావచ్చని వెల్లడించారు.
ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముగింపు సభకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి వెల్లడించారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్ల పై ఆయన ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగు మహాసభలు అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ ఐదు రోజులు ప్రతి రోజూ సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9.30 వరకు లాల్ బహదూర్ స్టేడియంలో కార్యక్రమాలు జరుగుతాయని, ఇందులో మూడు రోజులు రోజూ 2 గంటల పాటు సాహితీసదస్సులు, రెండున్నర గంటల పాటు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు.
ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బాలలు, మహిళలు, ప్రవాస తెలుగువారికి కూడా వేదికలో స్థానం ఉంటుందని సిధారెడ్డి తెలిపారు. లలితకళా తోరణంలో జానపద కళల ప్రదర్శన జరగుతుందన్నారు. రవీంద్ర భారతిలో శాస్త్రీయ కళల ప్రదర్శన, రవీంద్ర భారతి మినీ స్టేడియంలో అష్టావధానాలు, సారస్వత పరిషత్ లో శతావధానం, ఇండోర్ స్టేడియంలో బృహత్కవి సమ్మేళనం ఉంటుందన్నారు.
ప్రపంచ తెలుగు మహాసభలకు ఇతర దేశాల నుంచి 500 మంది అథిదులు హాజరవుతారని ఆయన చెప్పారు. ఇతర రాష్ట్రాల నుండి నుంచి 1500 మంది అతిధులు వేంచేయనున్నారని స్థానికంగా 6 వేల మంది వరకు హాజరవుతారని సిధారెడ్డితెలిపారు.
స్టేడియం లోపల 8 ద్వారాలు 8 మంది సుప్రసిద్ధ కవుల పేర్లతో ఏర్పాటు చెయనున్నామని, పురావస్తు ప్రదర్శనశాల, పుస్తకాల ప్రదర్శనశాల తదితర 8 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని, వెలుపల తెలంగాణ వంటలకు సంబంధించి 50 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు సిధారెడ్డి వివరించారు. ఈనెల 18న సినీ సంగీత విభావరిని నిర్వహించడంతో పాటు సినీ ప్రముఖులకు సన్మానం చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలుగు మహాసభలకు ఆహ్వానిస్తు న్నట్లు ఆయన పేర్కొన్నారు. 19వ తారీఖు జరగనున్న ముగింపు కార్యక్రమానికి మాననీయ భారత రాష్ట్రపతి శ్రీ రామనాధ్ కోవింద్ గారు విచ్చేయనున్నారు.