రాజకీయ వారసత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వీటిపై అటు తెలుగుదేశంతో పాటు ఇటు వైసీపీ నేతల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా.. పవన్పై ఘాటుగానే స్పందించారు. చినికి చినికి గాలివానలా మారిన వివాదం ఇప్పుడు రోజా వర్సెస్ ఒక నిర్మాతగా మారిపోయింది. పవన్కు సన్నిహితుడు, నటుడు, నిర్మాత బండ్ల గణేష్, రోజా మధ్య మాటల యుద్ధమే జరిగింది. విమర్శల స్థాయి దాటిపోయి వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లిపోయింది. పళ్లు రాలగొడతా అంటూ ఇప్పుడు ఎమ్మెల్యే రోజాకు బండ్ల వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది.
మూడు రోజులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేసి.. వివిధ రాజకీయ పార్టీలపై తీవ్రంగా విమర్శలు చేశారు పవన్ కల్యాణ్! ఇప్పుడు వీటిపై వివిధ చానళ్లలో చర్చా గోష్టి మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక టీవీ చానల్ చర్చలో.. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, సినీ నటుడు బండ్ల గణేష్ మధ్య వాదోపవాదాలు సాగాయి. సదరు చర్చలో ఫోన్ లైన్లో రోజా మాట్లాడుతుండగా...స్టూడియోలో ఉన్న గణేష్ ఈ సందర్భంగా రోజాపై మండిపడ్డారు. ఆ టీవీ చర్చలో వారసత్వ రాజకీయాలు, ప్రజాభిమానం గురించి చర్చ నడుస్తుండగా రోజా మాట్లాడుతూ.. జగన్ను వారసత్వ నాయకుడిగా చూడలేమన్నారు. ప్రజాభిమానంతో ముందుకు వెళుతూ 67 మందిని గెలిపించుకున్నారని తెలిపారు.
ఎనిమిదేళ్లలో తనకంటూ ఒక పార్టీ పెట్టుకొని సిద్ధాంతాలు తీర్చిదిద్దుకొని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు సాగుతున్నారని రోజా అన్నారు. అలాంటపుడు అనవసరమైన సమయంలో అనవసరంగా జగన్ను అనాల్సిన అవసరం పవన్ కల్యాణ్ కు ఏం వచ్చింది? జగన్ ఏ రోజు పవన్ గురించి మాట్లాడలేదు. అయినప్పటికీ పవన్ మాట్లాడుతున్నారు. అని ప్రశ్నించారు. చిరంజీవి గారి ఇంట్లో తక్కువమంది కష్టపడిన వారు ఉన్నారని అన్నారు. చిరు తమ్ముళ్లు, కొడుకు, మేనల్లుడు , చిన్న అల్లుడు ..కేవలం చిరు చరిష్మాతో వస్తున్నారు. వాళ్లది వారసత్వం అన్నారు.
దీనిపై గణేష్ స్పందిస్తూ `ఆడు ఈడు అని పవన్ కల్యాణ్ ను విమర్శించడం సరికాదు` అన్నారు. మరింత ఆవేశంగా మాట్లాడొద్దని పాయింట్ మీద మాట్లాడాలని రోజా సూచించడంతో.. `రెండు సార్లు ఓడిపోయి ఓ సారి ఎమ్మెల్యే అయ్యారు. దేశం మొత్తం మీ గోల్డెన్ లెగ్ గురించి కోడై కూస్తోంది. అందుకే వైఎస్ ను పైకి పంపించారు` అంటూ వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్రంగా ఆవేదన చెందిన రోజా.. `నేనేమైనా దగ్గరుండి పైకి పంపించానా? ఇలా మాట్లాడటం ఏంటి. నువ్వు ఏమైనా పక్కన ఉండి పక్కలు వేస్తున్నావా పవన్ కల్యాణ్ కు? ` అంటూ అనడంతో `నీ పళ్లు రాలిపోతాయి పవన్ ను ఏమైనా అన్నావంటే` అంటూ విరుచుకుపడ్డారు. రోజా స్పందిస్తూ `రా...ఎవరివి రాలుతాయో చూద్దాం` అంటూ ఘాటు సమాధానం ఇచ్చారు.