ఏపీలో మూడు రోజుల పాటు జరిగిన జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటన.. రాష్ట్ర ప్రజలను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేసింది. మిత్రపక్షమని లేదు.. విపక్షమని లేదు.. ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. ఇదే విశ్లేషకులను కూడా అయోమయంలో పడేస్తోంది. వైసీపీ, బీజేపీతో ఆయన కలిసేది లేదని తేలిపోయింది. ఇప్పటికీ టీడీపీపై పవన్కు ఇదే సమయంలో పవన్పై చంద్రబాబుకు సాఫ్ట్కార్నర్ ఉందని చెబుతున్నారు. ఇక మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని, అందుకు సీట్ల లెక్కను సిద్ధం చేశారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న కాకినాడ ఎంపీ సీటు జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారనే లీకులు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఇక్కడ నుంచి పవన్ సోదరుడు నాగబాబు పోటీచేయవచ్చనే టాక్ వినిపిస్తోంది!
ఏపీలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతలు పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి పోటీచేసినా.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఇదే సీన్ రిపీట్ అవుతుందని భావించలేమని విశ్లేషకులు చెబుతున్నారు. మరోపక్క బీజేపీతో కటీఫ్ చేసుకున్నా.. పవన్తో కలిసి ప్రయాణించాలని చంద్రబాబు భావిస్తున్నారు. పవన్-చంద్రబాబు మధ్య మంచి అవగాహన ఉందని పార్టీ నేతలే చెబుతున్నారు. అన్ని సమీకరణాలు లెక్కలేసిన బాబు.. బీజేపీతో దూరమైనా ఫర్వాలేదుగాని.. పవన్ను దూరం చేసుకునే సాహనం చేయరని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందు పొత్తు ప్రతిపాదనతోపాటు సీట్లు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి రెండు ఎంపీ, 25 ఎమ్మెల్యే స్థానాలు జనసేనకు ఇవ్వబోతున్నారట.
పొత్తులో భాగంగా జనసేనకు అరకు, కాకినాడ ఎంపీ సీట్లు ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇక కాకినాడ ఎంపీ సెగ్మెంట్లో టీడీపీ బలంగా ఉంది. ఇక్కడ పవన్, జనసేన అభిమానులతో పాటు కాపు వర్గం ఓటర్లు ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి జనసేన తరపున పవన్ సోదరుడు నాగబాబు ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. వాస్తవానికి ప్రజారాజ్యం పెట్టినప్పుడే నాగబాబు భార్య పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారట. ఆ ఎన్నికల్లో చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీ చేయడంతో ఒకే జిల్లా నుంచి ఇద్దరు మెగా ఫ్యామిలీ సభ్యులు పోటీ చేయడం కరెక్ట్ కాదని చివరి క్షణంలో విరమించుకున్నారు.
ఇక రెండేళ్ల క్రితం నాగబాబు - పవన్ మధ్య గ్యాప్ ఉన్నా ఇటీవల పవన్కు నాగబాబు బాగా దగ్గరయ్యారు. తాను జనసేన కోసం చేయాల్సింది చాలా ఉందని చెబుతున్నారు. ఇక పవన్ కూడా వచ్చే ఎన్నికల్లో కాకినాడ నుంచి నాగబాబును ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టు జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది. టీడీపీతో పొత్తు ఉంటే నాగబాబు గెలుపు నల్లేరుపై నడకే అన్నది జనసేన వర్గాల ఆలోచన. అయితే గతంలోనూ నాగబాబుకు కాకినాడ నుంచి ఎంపీగా పోటీచేస్తారనే ప్రచారం జరిగింది. అప్పుడు చిరు ద్వారా సాధ్యం కానిది.. ఇప్పుడు పవన్తోనైనా సాధ్యమవుతుందో లేదో వేచిచూడాల్సిందే!!