ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఏపీకి మంచి కిక్ ఇచ్చినట్లయింది. కొంతకాలంగా పోలవరం ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి... ఒక పాజిటివ్ అట్మాస్పియర్ తీసుకొచ్చారు. ఇది రాష్ట్రానికి పెద్ద శుభవార్తే.! కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశమైన చంద్రబాబు.. కేంద్రం నుంచి పోలవరంపై పలు సానుకూలమైన హామీలు పొందారు.
పోలవరం ప్రాజెక్టుపై కొన్ని రోజుల నుంచి హైడ్రామా నడుస్తోంది. హైడ్రో కార్పొరేషన్ సర్వే అయ్యే వరకూ కాఫర్ డ్యాం పనులు మొదలుపెట్టటానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ పంపింది. అనంతరం దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలోనూ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నుంచి సరైన సహకారం అందడంలేదని ఆవేదన వెలిబుచ్చారు. దీంతో ఒక్కసారిగా పోలవరం ప్రాజెక్టుపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వైసీపీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఎవరికి వారు కామెంట్లు, సలహాలు ఇచ్చేశారు. దీంతో పోలవరంపై ప్రజల్లో కలవరం మొదలైంది..
సీఎం చంద్రబాబు మాత్రం పోలవరంపై ఆచితూచి స్పందించారు. పోలవరంపై కేంద్రంతో చర్చిండానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ లండన్ వెళ్లారని, ఆయన వచ్చిన తర్వాత క్లారిటీ ఇస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే గడ్కరీ లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత... ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఆయన్ని కలిసి పోలవరంపై వ్యక్తమవుతున్న అనుమానాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రాజెక్టుపై కూలంకుషంగా చర్చించారు..
గడ్కరీతో చర్చలు అనంతరం విజయవాడ వచ్చిన సీఎం చంద్రబాబు... పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడారు. 2018 నాటికి గ్రావిటీపై గోదావరి జలాలను కృష్ణమ్మకు తరలిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకతను గడ్కరీకి వివరించానన్న సీఎం... ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై కూడా కేంద్రం నుంచి స్పష్టత తీసుకున్నానని తెలిపారు. ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని... పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఏదిఏమైనా చంద్రబాబు ఢిల్లీ పర్యటన చాలా అనుమానాలకు తెరదించిందని చెప్పవచ్చు. పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తవుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించినట్టయింది.