పాకిస్థాన్ మరోసారి తన వక్ర బుద్దిని చూపించింది. భారతీయులను బంధించి తమ పైశాచికాన్ని మరోసారి నిరూపించారు. అరేబియన్ మహా సముద్రంలో ప్రాదేశిక జలాల్లో చేపలు పడుతున్నారనే ఆరోపణపై భారత్కు చెందిన 43 మంది మత్స్యకారులను పాకిస్తాన్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అయితే మత్యకారులను తమ ప్రాంతంలోకి అక్రమంగా వచ్చారంటూ పాకిస్థాన్ సముద్ర తీర ప్రాంత గస్తీ దళం వారిని అదుపులోకి తీసుకుంది.
మత్స్యకారులను గురువారమే అరెస్టు చేశామని, వారిని డాక్స్ పోలీసులకు అప్పగించామని, పాకిస్తాన్ సముద్రయాన భద్రతా దళ (పిఎంఎస్ఎఫ్) అధికార ప్రతినిధి తెలిపారు. గతంలో కూడా పలు మార్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడిన పాక్ అధికారులు తాజాగా మరోసారి తమ నైజాన్ని నిరూపించుకుంది. పాకిస్తాన్ సముద్ర జలాల్లో అక్రమంగా చేపలు పడుతున్నారని గత నెల నుండి144 మంది భారత మత్స్యకారులను అరెస్టు చేశారు.
ఈ సంవత్సరం మొత్తం 400 మంది మత్స్యకారులను ఇదే తరహాలో అరెస్టు చేశారు. అరేబియన్ సముద్రంలో పాకిస్తాన్ సముద్ర సరిహద్దు వద్ద పిఎంఎస్ఎఫ్ సిబ్బంది పహారా కాస్తున్న సమయంలో తమ జలాల్లో మత్స్యకారుల ప్రవేశించడాన్ని గుర్తించామని, స్పీడ్ బోట్లు, హెలికాఫ్టర్ల సహాయంతో వారిని నిర్భంధించామని వాజిద్ నవాజ్ తెలిపారు.