గుజరాత్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు బీజేపీనా లేక ప్రధాని మోడీనా? ఇదేం ప్రశ్న అనుకుంటే పొరపడినట్టే! గుజరాత్ గెలిస్తే మోడీ గెలిచినట్టు కాదా? మోడీ గెలిస్తే బీజేపీ విజయం సాధించినట్టు కాదా? అనే ప్రశ్న రావొచ్చు! కానీ ఈ రెండింటికీ చాలా వ్యత్యాసమే ఉంది మరి! ఈ ప్రశ్నలన్నీ పక్కన పెట్టేస్తే.. గుజరాత్లో మాత్రం బీజేపీ కంటే ఎక్కువగా విజయం సాధించింది మోడీనే! ఎందుకంటే.. ఒకపక్క మోడీ వ్యతిరేక పవనాలు సొంత రాష్ట్రంలో విపరీతంగా వీచాయి.
అలాగే మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తోపాటు పటేల్లకు రిజర్వేషన్ కోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్తో పాటు ఇతర శక్తులన్నీ జట్టుకట్టాయి. దీంతో హోరాహోరీగా అనేకంటే ఒక దశలో బీజేపీ కంటే కాంగ్రెస్ హవా కొనసాగింది. అయితే వీటన్నింటి నుంచి బీజేపీకి గట్టెక్కించారు మోడీ!!
మోడీ హవా తగ్గిపోతోంది! జీఎస్టీ, నోట్లరద్దుతో మోడీ ప్రభ క్రమక్రమంగా పడిపోతోందనే వార్తలు గుజరాత్ ఎన్నికల ముందు ప్రచారం హోరెత్తింది. ఈ ఎన్నికల ప్రభావం తన వ్యక్తిగత ప్రతిభకే సవాలు విసరుతుండటంతో.. నేరుగా మోడీ రంగంలోకి దిగారు. కానీ తొలి దశలో ఎక్కడా ప్రభావం చూపలేకపోయారు.
అప్పటికి కాంగ్రెస్తో పాటు ఇతర నేతలదే హవా! అయితే తొలి దశ ఎన్నికల్లోనూ బీజేపీ నేతలకు విజయంపై నమ్మకాలే లేవు! అయితే మోడీని `నీచ్` అని సంభోదిస్తూ కాంగ్రెస్ బహిష్కృత నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలతో.. కాంగ్రెస్ డిఫెన్స్లో పడిపోయింది. ఇదే బీజేపీకి అస్త్రంలా మారింది. మోడీ దీనినే ప్రచార ఆయుధంగా చేసుకున్నారు.
`నేను మీ వాడిని. పటేళ్లంటే కాంగ్రెస్కు చులకనభావం ఉంది` అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. మెజారిటీ వర్గాలను ప్రభావితం చేయగలిగారు. దీంతో రెండో దశలో బీజేపీకి అనూహ్యంగా మద్దతు ఎక్కువైంది. పోలింగ్ శాతాన్ని బట్టి చూసినా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. వ్యతిరేకతను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో మోడీ సూపర్ సక్సెస్ అయ్యారు! ఫలితంగా గుజరాత్లో బీజేపీని గట్టెక్కించేశారు. కాంగ్రెస్-బీజేపీ మధ్య ఆసక్తికరమైన పోరు తప్పదని ముందునుంచే సర్వేలు చెబుతూ వస్తుండటంతో మొత్తం యంత్రాంగన్నంతా మోహరించేశారు. ఏదయితేనే మొత్తానికి బీజేపీ గెలిచింది. మరి నిజంగానే ఇక్కడ మోడీ గెలిచారా? అంటే అవుననే చెప్పాలి!
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి చూసినంతనే మనసుకు అనిపించే అంశాలివే. గుజరాత్ రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా చూస్తే మధ్య.. దక్షిణ గుజరాత్ లలో ఓటర్లు బీజేపీ పట్ల సానుకూలంగా వ్యవహరించగా.. సౌరాష్ట్ర- కచ్ ప్రాంతంలో బీజేపీని విస్పష్టంగా తిరస్కరించారు. ఇక.. ఉత్తర గుజరాత్ లో రెండు పార్టీల మధ్య పోటాపోటీ నడుస్తోంది. బీజేపీ మేజిక్ మార్క్ సాధిస్తుందంటే అది కేవలం మధ్య.. దక్షిణ గుజరాత్ పుణ్యమేనని చెప్పక తప్పదు. మధ్య గుజరాత్ లో మొత్తం 61 స్థానాల్లో కడపటి సమాచారం ప్రకారం బీజేపీ 44 స్థానాల్లో అధిక్యతలో ఉండగా.. కాంగ్రెస్ మిత్రపక్షాలు 17 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఉత్తర గుజరాత్ లో మొత్తం 32స్థానాలకు బీజేపీ 16 స్థానాల్లో అధిక్యతలో ఉండగా.. కాంగ్రెస్ మిత్రపక్షాలు 15 స్థానాల్లో ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు .
సౌరాష్ట్ర- కచ్ లో బీజేపీకి దారుణ పరాభవం ఎదురైంది. ఇక్కడ మొత్తం 54 స్థానాలుంటే బీజేపీ కేవలం 19 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంటే.. కాంగ్రెస్ మిత్రపక్షాలు 33 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు. ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక.. దక్షిణ గుజరాత్ లో బీజేపీ అభ్యర్థులు 23 స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 11 స్థానాల్లో అధిక్యంలో ఉంది. మొత్తం మీద గుజరాత్లో మోడీ గెలిచినా…బీజేపీ మాత్రం ఓడిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే మోడీ వల్లనే ఆ మాత్రం సీట్లయినా దక్కాయనిచెప్పుకోవాలి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మిషన్ 150 తో ముందుకెళ్లారు. అయినా 110 సీట్లు దాటక పోవడంతో పార్టీపరంగా ఓడిపోయినట్లే.