నందమూరి నటసింహం చేస్తున్న ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీకి ఎంత అనుకూల పరిస్థితిని తెచ్చిపెడుతుందో కానీ.. అక్కడక్కడ బాలయ్య నోరు జారుతున్న తీరును చూస్తే మాత్రం బాలయ్య తెలుగుదేశానికి చాలా నష్టమే చేసేట్టు ఉన్నాడని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య ఒకసారి "జగన్ దే అధికారం..'' అని వ్యాఖ్యానించి నాలుక్కరుచుకొన్నాడు. ఇక బాలయ్య ప్రసంగాలు అంత పదునుగా ఉండవని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పదాల కోసం తడుముకోవాల్సి రావడం, ధాటిగా ప్రసంగించలేకపోవడం బాలయ్యకు మైనస్ పాయింట్లు. వాటి సంగతి అలా ఉంటే... బాలయ్య ప్రచారం మొదలుపెట్టిన తొలి రోజు నుంచే ఎన్టీఆర్ పై సెటైర్లు వేయడం ప్రారంభించాడు. తెలుగుదేశం తరపున ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడా? అంటే బొట్టు పెట్టి పిలవం అని ఆయన అన్నాడు. పదే పదే ఆ విషయాన్ని రిపీట్ చేశాడు. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా బాలయ్య ఉత్తరాంధ్రలో చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ ఉత్తరాంధ్రలో ప్రచారం చేశాడు.. కదా ఇప్పుడు చేస్తాడా? ఎన్టీఆర్ ప్రచారం వల్ల లాభం ఉంటుందని మీరు అనుకొంటున్నారా? అని మీడియా అడిగితే బాలయ్య తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ ఉత్తరాంధ్రలో ప్రచారం చేస్తే ఏమొచ్చాయ్?! అని ఎదరు ప్రశ్నించాడు బాలయ్య. ఈ ప్రాంతంలో తెలుగుదేశం గత ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. శ్రీకాకుళం, విజయవనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పరువునిలబెట్టుకోలేకపోయింది. ఈ విషయాన్నే ఇప్పుడు బాలయ్య ప్రస్తావిస్తున్నాడు! ఎన్టీఆర్ ప్రచారం చేసిన చోట తెలుగుదేశానికి ఏమొచ్చాయ్?! అని ఆయన ఎదురు ప్రశ్నించాడు. మరి ఇలా పొట్ట చీల్చుకోవడం ఎందుకో అర్థం కావడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ను అవమానిస్తే బాలయ్యకు వచ్చేది ఏమిటో అంతుబట్టడం లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: