కాంగ్రెస్ పార్టీ విధానాల గురించి తీవ్రంగా విమర్శిస్తున్నాడు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు పదేళ్ల కాంగ్రెస్ పార్టీ విధానాలను తప్పుపడుతున్నాడు. రాష్ట్రానికి లభించిన ఆదాయాన్ని కాంగ్రెస్ నేతలు దోచుకుతిన్నారని ఆయన వ్యాఖ్యానిస్తున్నాడు. ఆ డబ్బును ముక్కుపిండి వసూలు చేస్తానని కూడా హామీ ఇస్తున్నాడు. అలాగే రాష్ట్ర విభజన ఉందంతంలో కూడా కాంగ్రెస్ ను ఆయన విమర్శిస్తున్నాడు. మనల్ని కట్టుబట్టలతో రోడ్డు మీదకు తోసేశారని బాబు సెలవిస్తున్నారు. మరి అంత దారుణం జరుగుతున్నప్పుడు బాబు ఏంచేశారు? అని అనేది మనకు తెలియనిది కాదు! ఆ సంగతి అంతా అలా ఉంటే..బాబు తనదైన ఒక ప్రాసను పలికాడు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఒక ఆసక్తికరమైన డైలాగును పేల్చేశాడు. కాంగ్రెస్ పార్టీ వీరప్పన్ లను తయారు చేసిందని బాబు వ్యాఖ్యానించాడు! పదేళ్ల పాలనలో అదే జరిగిందని.. ఆయన అన్నాడు. ఈ డైలాగ్ బాగానే ఉంది కానీ.. అలాంటి వీరప్పన్ లలో చాలా మంది ఇప్పుడు తెలుగుదేశంలో చేరిపోయారనే విషయాన్ని బాబు గారు మరిచారని అనిపిస్తోంది! కాంగ్రెస్ తరపున మొన్నటి వరకూ దోచేసిన వారిలో ఆరుమంది ఎంపీలు, ఒక మంత్రిగారు, 24 మంది ఎమ్మెల్యేలు, నేతలు తెలుగుదేశంలో ఉన్నారు! టీడీపీ నేతలుగా చెలామణి అవుతున్నారు. పదేళ్ల పాటు అధికారం అనుభవించి.. మరో ఐదేళ్ల అధికారానికి వాళ్లంతా లైసెన్స్ పొందారు! మరి వారు వీరప్పన్ లు అయితే.. ఆ వీరప్పన్ లు అంతా తెలుగుదేశంలోనే సేదతీరుతున్నారు. బాబు ఇప్పుడు కాంగ్రెస్ ను విమర్శించడం అనేది.. ఒక కామెడీ అవుతుంది. కాంగ్రెస్ నేతల ముక్కపిండి అవినీతి సొమ్మును వెల్లగక్కిస్తానని బాబు ప్రజలకు హామీ కూడా ఇచ్చాడు. ఆ పని చేయడానికి గాంధీ భవన్ వరకూ వెళితే అక్కడ ఎవరూ కనపడరు. అందరూ ఎన్టీఆర్ భవన్ లోనే ఉంటారు. మరి బాబు ముక్కులు పిండటానికి ఎన్టీఆర్ భవన్ కు వెళతారా?!

మరింత సమాచారం తెలుసుకోండి: